నల్లగొండ, అక్టోబర్ 26: చెత్తగాళ్లకు చెత్త ఆలోచనలే వస్తాయని, ఓ రాజకీయ పార్టీకి బాధ్యతవహిస్తున్నా.. సోయి లేకుండా జోకర్లు, బ్రోకర్లలా మాట్లాడుతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్తు ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మంత్రి ఖం డించారు. వానకాలం పంటల కొనుగోలు, యాసం గి సాగు ప్రణాళికపై నల్లగొండ కలెక్టరేట్లో మంగళవారం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోయి లేకుండా మాట్లాడే వారికి నిర్మాణాత్మకమైన ఆలోచనలు రావన్నారు. జీవితంలో ఏ ఒక్క రోజూ బాధ్యతగా పనిచేసిన చరిత్ర లేని వారికి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ‘అసలు నీకు పీసీసీ పదవి ఎలా వచ్చిందో.. నీ పార్టీవారే బహిరంగంగా చెప్పుతున్న విషయం తెలుసుకో’ అని రేవంత్కు సూచించారు. రాష్ర్టాన్ని సాధించి దేశంలోనే ఆదర్శపాలన అందిస్తున్న టీఆర్ ఎస్ పార్టీ జరుపుకొన్న ప్లీనరీ విజయవంతం కావడంతో జీర్ణించుకోలేక.. టీఆర్ఎస్ క్యాడర్లో నూతనోత్తేజాన్ని చూసి తట్టుకోలేక ఆయనకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడే ఇలావుంటే రేపు జరుగబోయే విజయ గర్జనతో పిచ్చోళ్లు కావడం ఖాయమన్నారు.
సీఎం కేసీఆర్ తన పాలనతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి దీవెనెలు అందుకుంటున్నారని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. అలాంటి పెద్దాయనను తిడితే పెద్దోళ్లు కారని, పెద్దలను అనుకరిస్తేనే పెద్దవాళ్లు అవుతారనే విషయం తెలుసుకోవాలని సూచించారు. పులి వేషం వేస్తే పులులు కారని, చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. ‘మీరు మాట్లాడే భాష మాకూ వచ్చు.. మేము మాట్లాడితే ఎలా ఉం టదో చూస్తావా?’ అని రేవంత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నోరుందని బయట మాట్లాడటం కాదు.. అసెంబ్లీలో, పార్లమెంటులో మాట్లాడుదాం.. చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని రేవంత్కు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు పాల్గొన్నారు.