ములుగు : చట్టాలు ఎలా చేస్తారు? రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేస్తారో కూడా తెలియని మూర్ఖపు వ్యక్తి మనకు ప్రధానిగా ఉండడం ఈ దేశ ప్రజల దురదృష్టమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి మేడారం జాతర పనుల పర్యవేక్షణ, సమీక్ష సందర్భంగా ములుగు, గట్టమ్మ దేవాలయంలో అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం తెలంగాణ పట్ల బీజేపీ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ప్రధాన మంత్రి మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ అనేకసార్లు తెలంగాణపై అక్కసు వెళ్లగక్కి తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీశారు. బీజేపీ వైఖరి, ప్రధాని వైఖరి తేట తెల్లం అయ్యిందన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
60 ఏళ్ల పోరాటంలో తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు బలిదానం చేసుకున్నారని మంత్రి తెలిపారు.
మా రాష్ట్రం మాకు కావాలని ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పోరాడారు. ఇంతమంది ఉసురు పోసుకుని సాధించేది ఏముందని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది.
దీనికి బీజేపీ నేతలు కూడా మద్దతు పలికారు. ఇప్పుడు ఇలా విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. చరిత్ర తెలుసుకోకుండా పార్లమెంట్ తలపులు వేసి రాష్ట్రం ఇచ్చారని అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆరోజు మీ నాయకులు కల్లు మూసుకుని మద్దతు ఇచ్చారా? ప్రధానిని సూటిగా ప్రశ్నించారు. గట్టమ్మ దేవాలయం వద్ద కొత్తగా అన్ని వసతులు కల్పించామన్నారు.
మేడారంలో మంత్రి కలెక్టర్ కృష్ణ ఆదిత్య తో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం జాతర పనులను, పార్కింగ్ స్థలాలను, కామన్ డైనింగ్ హాల్ ను, జంపన్న వాగును పరిశీలించారు.
హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన సులభ్ కాంప్లెక్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో కమ్యూనిటీ డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. అనంతరం మేడారం జాతర పనులను సమీక్షించారు.
కార్యక్రమాల్లో ఎస్పీ సంగ్రామ్ సింగ్, అదనపు ఎస్పీలు, ఆలయ ఈవో రాజేందర్, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ శంకర్ రావు, ఈఈ హేమలత, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ మురళీధర్ రావు, ఐటిడిఎ ఏ .పి. ఓ వసంత్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎర్రయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.