Health Tips | నమస్తే మేడం. బరువును, మధుమేహాన్ని నియంత్రించేందుకు తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలని చెబుతారు కదా! ఒక రోజులో ఎన్నిసార్లు తినొచ్చు. ఎన్ని గంటల నిడివిలో తినాలి. ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
– ఓ పాఠకురాలు
ప్రతి రెండు నుంచి రెండున్నర గంటల వ్యవధిలో ఈ తరహా ఆహారాన్ని తీసుకోవాలి. మహా అయితే మూడు గంటల విరామం ఇవ్వొచ్చు. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకునే అలవాటు.. అతిగా తినడాన్ని అరికడుతుంది. ఎక్కువ విరామం తర్వాత తింటే గట్టిగా ఓ పట్టు పట్టేస్తాం. గిన్నె ఖాళీ చేసేస్తాం. అలా కాకుండా పొట్ట నిండుగా ఉండి.. అప్పుడే తిన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ఎక్కువ తినడం మహాకష్టం. ఇందులో మరో సూక్ష్మమూ ఉంది.
మనం తినే ఆహారాన్ని అయిదు రకాలుగా విభజిస్తారు. ఇందులో ప్రొటీన్ల్లు, కార్బొహైడ్రేట్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, మినరల్స్.. ఇలా రకరకాల పోషకాలు ఉంటాయి. ఇలా ఎక్కువసార్లు తింటే.. అన్ని రకాల పోషకాలనూ తీసుకోగలం. ఫలితంగా సమతులాహారం సాధ్యమవుతుంది. అంతేకాదు, శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. తిన్న కాసేపటికి నీళ్లు తాగుతూ ఉంటాం కాబట్టి, శరీరానికి సరిపడా ద్రవాలు అందుతాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా, ఆహారం తీసుకోవడంలో విరామం కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో ఉబ్బరం, వాంతులు, తేన్పుల్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ఇలా తింటే ఆ సమస్యే ఉండదు. సమతులాహారం ప్రభావంతో చర్మం, జుట్టు ఆరోగ్య వంతంగా తయారవుతాయి. బేరియాట్రిక్ సర్జరీకి వెళ్లే ముందు, తర్వాత కూడా ఇది మంచి ఆహార పద్ధతి. ఈ విధానంలో సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు, పీచులు ఉండటం వల్ల పొట్ట వాటిని నెమ్మదిగా అరిగిస్తూ ఇన్సులిన్ పనితనం మెరుగు పడేందుకు దోహదం చేస్తుంది. తద్వారా శరీరంలో గ్లూకోజ్ విడుదల నెమ్మదిగా జరుగుతుంది. ఇది బరువును తగ్గించేందుకు, మధుమేహాన్ని నియంత్రించేందుకు దోహదపడుతుంది.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com