దేశీయ ఐటీ రంగంలో ఇప్పుడు ఫ్రెషర్ల కాలం నడుస్తున్నది.
పరిశ్రమలోని మెజారిటీ సంస్థలు తమ నియామకాల్లో కొత్తవారికి పెద్దపీట వేస్తున్నాయి.
ఇప్పటికే భారీ ఎత్తున తీసుకున్న ఐటీ కంపెనీలు.. మున్ముందు మరింతగా ఉద్యోగాల్లో పెట్టుకోవచ్చన్న అంచనాలున్నాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దాదాపు 3,50,000- 3,60,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చని మెట్రిక్స్ బెంచ్మార్కింగ్ అండ్ మార్కెట్ ఇంటిలిజెన్స్ కంపెనీ అన్ఎర్త్ఇన్సైట్ విడుదల చేసిన ‘ఐటీ ఇండస్ట్రీ క్యూ3 ఇన్సైట్స్ అండ్ 2021-22 అంచనా’ నివేదిక చెప్తున్నది. 30కిపైగా ఐటీ సేవల సంస్థలు తమ మొత్తం ఉద్యోగుల్లో 14-18 శాతం ఫ్రెషర్స్నే పెట్టుకోనున్నాయి. ఐటీ బూమ్తో ఈ పరిశ్రమలో లక్షలాది మందికి ఉద్యోగాలు లభించగా, ఏటా వేలాది మంది విద్యార్థులు ఐటీ ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే బడా సంస్థలతోపాటు మధ్య, దిగువశ్రేణి సంస్థలు భారీ స్థాయిలోనే ఫ్రెషర్లను కొలువుల్లోకి తీసుకోగా, వచ్చే నెలాఖర్లోగా మరింత మందికి ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
జీతాల పెంపు, పదోన్నతులు
ఇక ఐటీ పరిశ్రమలో వలసలు ఆందోళనకరంగా ఉండటంతో నైపుణ్యం, ప్రతిభగల ఉద్యోగులు చేజారిపోకుండా ఆయా సంస్థలు అనేక తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఇందులోభాగంగానే ప్రథమ, ద్వితీయ శ్రేణి సంస్థలు సగటున 8-12 శాతం మేర జీతాలను పెంచుతున్నాయని, అలాగే సుమారు 15-20 శాతం ఉద్యోగులకు పదోన్నతులనూ కల్పిస్తున్నాయని నివేదిక పేర్కొన్నది. స్టాక్ ఆప్షన్స్, దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు, అప్స్కిల్లింగ్/రీస్కిల్లింగ్ శిక్షణ, హైయర్ స్కిల్ ఇంక్రిమెంట్ల వంటివి అందిస్తున్నాయి.
240 బిలియన్ డాలర్లకు..
భారత ఐటీ సేవల రంగం ఈ ఆర్థిక సంవత్సరం 230-240 బిలియన్ డాలర్లను తాకవచ్చని తాజా నివేదిక అంచనా వేసింది. 15-20 ప్రధాన ఐటీ కంపెనీల దూకుడు ఇందుకు దోహదం చేస్తున్నదని పేర్కొన్నది. ద్వితీయ శ్రేణి సంస్థలూ ఆకర్షణీయమైన వృద్ధిని కనబర్చుతుండటం కలిసొస్తున్నది. కాగా, ఉద్యోగుల వలసల్ని అడ్డుకునేందుకు ఆయా సంస్థలు చేపడుతున్న ప్రోత్సాహక చర్యలు.. వాటి లాభాలను ప్రభావితం చేస్తున్నాయని ఈ సందర్భంగా నివేదిక తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 19-21 శాతం రెవిన్యూ వృద్ధిని సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయన్నది.