హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉన్నతోద్యోగులు దీపావళి తర్వాత ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ఆయా కంపెనీలు ఇప్పటికే ముందస్తు సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తున్నది. దీంతో మళ్లీ నగర కార్పొరేట్ సంస్థల్లో సందడి వాతావరణం నెలకొననున్నది. కరోనా మహమ్మారి కారణంగా గత 18 నెలలుగా హైదరాబాద్ ఐటీ కేంద్రంగా పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల్లో 90 శాతం ఇంటి నుంచే తమ విధులను నిర్వహిస్తున్నారు.
అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గడం, సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఉద్యోగులు కార్యాలయాలకే వచ్చి పనిచేసేలా యాజమాన్యాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ప్రాజెక్టులవారీగా టీమ్ లీడర్లకు మెయిల్ ద్వారా సమాచారాన్నీ అందించాయి. నిజానికి వచ్చే ఏడాది జూన్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని బహుళజాతి ఐటీ కంపెనీలు ప్రకటించాయి. కానీ ఊహించిన దానికంటే వేగంగా పరిస్థితులు అనుకూలించడంతో మేనేజ్మెంట్లూ గత నిర్ణయాలను సవరించుకుంటున్నాయి.
పూర్తి స్థాయిలో..
ఇక మధ్య, చిన్నతరహా ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు తక్కువ సంఖ్యలోనే ఉండటంతో పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అమలు చేయనున్నారని సమాచారం. నిజానికి ఇప్పటికే విస్తృతంగా వ్యాక్సినేషన్ డ్రైవ్లు నిర్వహించి, ఉద్యోగులందరికీ కొవిడ్ టీకాలనూ సంస్థలు వేయించాయి. వారి కుటుంబ సభ్యులూ తీసుకునేలా చొరవ చూపాయి. ఈ క్రమంలోనే నగరంలో దాదాపు 60
శాతానికిపై గానే ఐటీ ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా, దీపావళి తర్వాత 100 శాతం ఉద్యోగులు ఆఫీసుల్లోనే పనిచేసేలా కాకుండా తొలుత 50 శాతం ఉద్యోగులనే రప్పించే ఆలోచనలో సంస్థలు ఉన్నట్లూ తెలుస్తున్నది. ఏడాదిన్నరగా కార్యాలయాల నిర్వహణ పూర్తిస్థాయిలో లేకపోవడం, కొన్ని కంపెనీలు అద్దెకు తీసుకున్న స్థలాలను రద్దు చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి ఆఫీసు కార్యకలాపాలకు కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. ఇక మరికొన్ని సంస్థలు ఇంటి నుంచి కొన్ని రోజులు, ఆఫీసు నుంచి ఇంకొన్ని రోజులు పనిచేసుకునే వెసులుబాటును ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. చాలామంది ఉద్యోగులు దీనికే ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్నది.