ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కోసం దాదాపు ఐపీఎల్ జట్లన్నీ పోటీ పడ్డాయి. అయితే అతను మాత్రం టీమిండియాలో తన స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాడు. అదే సమయంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఈ ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్లిద్దరూ చాలా మంచి స్నేహితులు. 2016 అండర్-19 ప్రపంచకప్లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో పంత్ ఆడాడు. అప్పటి నుంచి స్నేహితులైన వీళ్లిద్దరూ ప్రస్తుతం టీమిండియాలో ఒకే స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇదే విషయాన్ని ఇషాన్ ముందు ప్రస్తావించగా.. ‘‘లేదు.. పంత్ స్థానాన్ని పొందాలనే ఆలోచన ఒక్కసారి కూడా నాకు రాలేదు. ఎందుకంటే జట్టులో ప్రాథమికంగా మా బాధ్యతలు వేరు’’ అని స్పష్టం చేశాడు. తామిద్దరం చాలా మంచి స్నేహితులమని, ఎప్పుడూ కలిసి సినిమాలు చూస్తుంటామని చెప్పాడు.
‘‘క్రికెట గురించి మేమిద్దరం చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం. ఏదైనా అంశాన్ని మెరుగు పరచుకోవాలంటే మొహమాటం లేకుండా చెప్పుకుంటాం. క్రికెట్ రొటీన్స్ మధ్యలో ఉన్నప్పుడు మేం ఒకే స్థానం కోసం పోటీ పడుతున్నట్లు ఎప్పుడూ అనుకోలేదు’’ అని వివరించాడు. ఇటీవల ముగిసిన భారత్, వెస్టిండీస్ టోర్నీలో ఇషాన్ ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే.