కొల్లాపూర్ : మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy ) , పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Jupally Krishnar rao ) అన్నారు.
మంత్రులు గురువారం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ప్రధాన భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పంప్ హౌస్, ప్యాకేజీ 2 ఓపెన్ కెనాల్, మహాత్మాగాంధీ కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ లిప్ట్ -1, వనపర్తి జిల్లా రెవల్లి మండలం ఎదుల రిజర్వాయర్, స్టేజ్ 2, కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో పాలమూరు-రంగా రెడ్డి( Palamuru-Rangareddy ) ప్రాజెక్టు పంప్ హౌస్, సొరంగం, కాల్వ నిర్మాణ పనులను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిని మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్ట్ లను సందర్శించినట్లు చెప్పారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్లను ఈ ఆర్థిక సంవత్సరంలో 2026 మార్చి 31 వరకు అన్ని విధాలుగా వందశాతం పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటిని నింపడానికి ఆరు నెలల సమయం పెట్టుకొని, ఏం ఏం పనులు చేయాలో, అదేవిధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపడానికి 2026 మార్చి వరకు నిర్ధిష్ట గడువును నిర్దేశించుకుంటామని తెలిపారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీం మొదటి లిఫ్టులో నిరుపయోగంగా ఉన్న రెండు మోటార్లను రెండు మూడు నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి వినియోగం లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. మంత్రుల వెంట ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్యెల్యేలు రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బాదవత్ సంతోష్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.