IREDA IPO | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: మార్కెట్ ర్యాలీని ఆసరా చేసుకుని, మరో సంస్థలో వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకోసం కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) త్వరలో ఐపీవోకు రానుంది. ఈ కంపెనీలో కేంద్రం 26.88 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)గా విక్రయించేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను సమర్పించింది.
ఓఎఫ్ఎస్తో పాటు మరో 40.31 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీచేస్తుంది. ఓఎఫ్ఎస్ ద్వారా షేర్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. కొత్తగా జారీచేసే షేర్లతో వచ్చే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఖర్చుచేస్తుంది. వాస్తవానికి 2017, 2019 సంవత్సరాల్లో ఐపీవోను కేంద్రం ప్రతిపాదించినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో వెనక్కు తగ్గింది. బుక్బిల్డింగ్ ప్రక్రియ ద్వారా జరిగే తాజా ఐపీవోలో 50 శాతం షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లకు 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం హైనెట్వర్త్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు.
ఎల్ఐసీ తర్వాత ఇదే.. ipo,
గత ఏడాది మే నెలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పబ్లిక్ ఇష్యూ తర్వాత ప్రభుత్వం జారీచేస్తున్న ఐపీవో ఇదే. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, వాటి విడిభాగాల తయారీ సంస్థలు, ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులకు ప్రారంభం నుంచి పూర్తయ్యేంతవరకూ అవసరమయ్యే ఫైనాన్షియల్ సర్వీసులు, ఇతర అనుబంధ సేవల్ని మినీరత్న కంపెనీ అయిన ఐఆర్ఈడీఏ అందిస్తుంది. జూన్ 30 నాటికి ఐఆర్డీఈఏ ఇచ్చిన రుణాలు రూ. 47,206 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.32,586 కోట్లు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.1,892 కోట్లు మంజూరుచేసింది. ఐపీవో తర్వాత ఐఆర్డీఈఏ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టవుతాయి.