న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఎల్ఐసీ మెగా ఐపీవో మార్చి 10న ప్రారంభమై, 14న ముగుస్తుందని మార్కెట్లో అంచనాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఎల్ఐసీ తన ముసాయిదా ప్రాస్పెక్టస్ను సెబీకి సమర్పించినప్పటికీ, నియంత్రణా సంస్థ అనుమతి ఇంకా లభించాల్సివున్నందున, ఇష్యూ ఎప్పుడు ప్రారంభించేదీ, ఏ ధరలో జారీ చేసేదీ తదితర వివరాల్ని ఇంకా వెల్లడించలేదు. కానీ భారత్ మార్కెట్లో ఇది అతిపెద్ద ఐపీవో అయినందున, మార్కెట్లో పలు రకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఇష్యూలో షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 65,400 కోట్లు సమీకరిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సంస్థకున్న పాలసీ హోల్డర్ల కోసం 3.16 కోట్ల షేర్లను ఐపీవోలో రిజర్వ్ చేస్తారని అంటున్నారు. పాలసీదారులకు, ఎల్ఐసీ ఉద్యోగులకు ఇష్యూ ధరపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే అధికారిక వార్తలు వెలువడ్డాయి.
త్వరలో మెగా ఐపీవోకు రానున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఎంబడెడ్ విలువ కేవలం ఆరు నెలల్లో ఐదు రెట్లు పెరిగింది. 2021 మార్చిలో రూ.95,600 కోట్లుగా ఉన్న విలువ సెప్టెంబర్ 30కల్లా రూ.5.4 లక్షల కోట్లకు పెరిగినట్టు ఎల్ఐసీ.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించిన ముసాయిదా ఐపీవో డాక్యుమెంట్లో తెలిపింది. లిస్టయిన ఇతర ప్రైవేట్ బీమా సంస్థల విధానానికి అనుగుణంగా తమ మిగులు లాభాల పంపిణీ విధానాన్ని మార్చినందున ఎంబడెడ్ విలువ అధికమైనట్టు ఎల్ఐసీ వివరించింది.
ఎల్ఐసీ వద్దనుండే మిగులును షేర్హోల్డర్లు, పాలసీ హోల్డర్లకు పంపిణీ చేసే విధానాన్ని మార్చడంతో ఎంబడెడ్ విలువ పెరిగినట్లు ఎల్ఐసీ చెపుతోంది. ఎల్ఐసీ ఇప్పటివరకూ తన లాభాల్లో 95 శాతం పాలసీ హోల్డర్లకు, 5 శాతం షేర్హోల్డర్లకు (ప్రభుత్వానికి) పంచుతోంది. ఇక మీదట 90 శాతం పాలసీ హోల్డర్లకు, 10 శాతం షేర్హోల్డర్లకు పంపిణీ చేసేలా విధానాన్ని మార్చింది. అలాగే లాభాల్ని బోనస్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేని పాలసీలకు (నాన్-పార్టిసిపేటింగ్ పాలసీలు) చెందిన లాభాన్నంతటినీ పాలసీ హోల్డర్లకు కాకుండా, షేర్హోల్డర్లకే పంపిణీ చేస్తుంది.