నల్లగొండ : సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల స్ఫూర్తి ప్రదాత అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిండి మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరు పేదలకు వరం అన్నారు.
మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని ప్రశంసించారు. పేదల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని రవీంద్ర కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునిత, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, ఆర్డీవో గోపిరాం, తహశీల్దార్ ప్రశాంత్, రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, మాధవరం జనార్దన్ రావు, సర్పంచ్లు మాధవరం రవీందర్ రావు, ఆంజనేయులు, అర్వపల్లి నర్సింహ, గొసుల అనంతగిరి, బొడ్డుపల్లి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.