నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంపై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాండ్ ఆర్ట్తో కళాఖండాలను తీర్చిదిద్ది సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నాడు. నిజామాబాద్ నగరానికి కె.మనోజ్ కుమార్ సాండ్ ఆర్ట్తో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దడంలో మేటి. ప్రజలను ఆయా రుగ్మతలపై అవగాహన కల్పించడంతో పాటుగా సామాజిక అంశాలపై పోరాటం చేసేందుకు ఇసుకతో చిత్రాలను అచ్చు వేసినట్లుగా దించడంలో దిట్ట.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రకటించిన హరిత నిధి కార్యక్రమం పట్ల స్ఫూర్తి పొందిన మనోజ్ కుమార్ తనదైన శైలీలో హరిత నిధిపై సాండ్ ఆర్ట్తో కళాఖండాన్ని తీర్చిదిద్దాడు. అంతేకాకుండా తెలంగాణకు హరితహారం పేరిట ప్రభుత్వం విడుదల చేసిన లోగోను సైతం అచ్చుగుద్దినట్లుగా వేసి జనాల్లో విస్తృతంగా చైతన్యం కల్పిస్తున్నారు. మొక్కలను సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని ప్రతీ ఒక్కరిని కోరుతున్నాడు. హరిత నిధికి ప్రతీ ఒక్కరూ తన వంతుగా సహకారం అందించి తెలంగాణ సర్కారు ఇచ్చిన పిలుపులో భాగం కావాలని కోరుతున్నాడు.