అహ్మదాబాద్ : మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్పై పలు దేశాల నుంచి సైబర్ అటాక్ జరగ్గా.. ఇందుకు సంబంధించి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ కీలక విషయాలను తెలిపింది. సైబర్ క్రైమ్ డీసీపీ అమిత్ ప్రకారం.. నుపుర్ వ్యాఖ్యల అనంతరం ఇండోనేషియా, మలేషియాకు చెందిన హ్యాకర్లు భారత్పై సైబర్ సైబర్ యుద్ధాన్ని ప్రారంభించారు.
ఈ హ్యాకర్లు ఆ వర్గానికి చెందిన హ్యాకర్లను సైతం సైబర్ దాడి చేయాలని కోరారు. ఈ మేరకు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ రెండు దేశాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇందులో సదరు హ్యాకింగ్ గ్రూప్పై చర్యలు తీసుకోవాలని కోరింది. మలేషియాకు చెందిన డ్రాగన్ ఫోర్స్, ఇండోనేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ ఇండోనేషియా నుపుర్ శర్మ కేసు తర్వాత రెండు దేశాలకు చెందిన ఈ హ్యాకర్ల గ్రూప్ ప్రపంచ ముస్లిం హ్యాకర్లకు విజ్ఞప్తి చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది.
భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్ వార్ ప్రారంభించాలని గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం హ్యాకర్లకు విజ్ఞప్తి చేసింది. ఇది మాత్రమే కాదు హ్యాకర్ గ్రూప్ దేశంలోని దాదాపు 2వేలకుపైగా వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. ఇటీవలి కాలంలో హ్యాకింగ్ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకోవడం గమనార్హం. నుపుర్ శర్మ ఇంటి లొకేషన్తో పాటు, హ్యాకర్లు అనేక ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టారు.
ఓ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా హ్యాకర్లు పాక్ జెండాను ప్రదర్శించారు. అంతే కాదు థానే పోలీసుల వెబ్సైట్ను హ్యాక్ చేశారు. జార్ఖండ్ గవర్నర్ ట్విట్టర్ ఖాతాను వదల్లేదు. ఈ విషయమై అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఇండోనేషియా, మలేషియా ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అమిత్ తెలిపారు. హ్యాకర్స్ గ్రూపుపై చర్యలు తీసుకోవాలని, ఇంటర్పోల్కు లుకౌట్ నోటీసు జారీ చేయాలని లేఖలో కోరినట్లు పేర్కొన్నారు.