ఢాకా: బంగ్లాదేశ్లో పడవ ప్రమాద మృతుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. సహాయక బృందాలు ఇవాళ మరో ఏడు మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం మృతుల సంఖ్య 32కు చేరింది. ఆదివారం ప్రఖ్యాత బోదేశ్వరి ఆలయానికి వెళ్తుండగా కరొటోవా నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాదం సమయంలో పడవలో వంద మంది వరకు ఉంటారని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నట్లు చెప్పారు.
ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ బృందాలు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టాయి. ఈ గాలింపుల్లో ఆదివారం 25 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ మరో ఏడు మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తం మృతుల సంఖ్య 32కు పెరిగింది. కాగా, ఈ ప్రమాదం నుంచి కేవలం 10 మంది మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరారు.
బంగ్లాదేశ్లో గతంలో కూడా రెండు భారీ పడవ ప్రమాదాలు జరిగాయి. 2015లో సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక.. మరో కార్గో నౌకను ఢీకొని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 2020లో ఢాకాలో ఒక పడవను మరో పడవ ఢీకొనడంతో మొత్తం 32 మంది మరణించారు.