న్యూఢిల్లీ : రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్-75లో భాగంగా ఆరు జలంతర్గాముల నిర్మాణానికి టెండర్ జారీపై భేటీలో చర్చించనున్నారు. ఆరు సబ్మెరైన్ల నిర్మాణానికి సుమారు రూ.50వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు పనులకు టెండర్లు పిలిచేందుకు ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. సమావేశంలో ఆమోదం తెలిపితే.. టెండర్లకు నోటిఫికేషన్ జారీకానుంది.
ప్రాజెక్టులో ఆరు అధునాతన జలంతర్గాములను మజగాన్ డాక్యార్డ్లో వీటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్కార్పీన్ క్లాస్ జలంతర్గాముల కంటే దాదాపు 50శాతం పెద్దదైన ఈ ప్రాజెక్టు కింద ఆరు సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గాములను నిర్మించాలని భారత నావికాదళం భావిస్తోంది. మారిటైమ్ ఫోర్స్ స్పెసిఫికేషన్ల ప్రకారం.. జలాంతర్గాముల్లో హెవీ డ్యూటీ ఫైర్పవర్, కనీసం 12 ల్యాండ్ అటాక్ క్రూయిస్ క్షిపణులు (ఎల్ఐసీఎం), యాంటీ షిప్ క్రూయిస్ క్షిపణులు (ఏఎస్సీఎం) ఉండాలి.
జలంతర్గాములు సముద్రంలో 18 హెవీవెయిట్ టార్పెడోలను మోసుకెళ్లే, ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని నేవీ పేర్కొంది. తర్వాతి తరం స్కార్పియన్ శ్రేణి కంటే ఎక్కువ ఫైర్పవర్ అవసరం. ప్రస్తుతం భారత నావికాదళంలో 140కి పైగా జలాంతర్గాములు, ఉపరితల యుద్ధ నౌకలు ఉన్నాయి. పాక్ నావికాదళంలో 20 మాత్రమే ఉన్నాయి. మరోవైపు హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా నావికాదళాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి భారత నావికాదళం అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్నది.