Oman Coast : ఒమన్ తీరం (Oman Coast) లో భారత జెండా (Indian flag) తో ప్రయాణిస్తున్న ఓ నౌక నీటమునిగింది. యాంత్రిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. అందులోని 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. వారంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ముంబై (Mumbai) కి వెళ్తున్న మరో నౌకలో వారిని ఎక్కించినట్లు ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. భారత జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంఎస్వీ విరాట్ 1’ నౌకకు సంబంధించిన సహాయక చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.
మొత్తం 14 మంది సిబ్బందిని రక్షించామని, వీరంతా ప్రస్తుతం ‘జబల్ అలీ 9’ నౌకలో ముంబైకి బయలుదేరారని భారత ఎంబసీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. అంతకుముందు ఒమన్ తీరంలో ఓ నౌక నిలిచిపోయిందని, ఇంజిన్ వైఫల్యమే దీనికి కారణమని పేర్కొన్నది. నౌకలోని సిబ్బంది లైఫ్ రాఫ్ట్లోకి మారారని, ఒమన్ అధికారుల సమన్వయంతో సమీపంలోని నౌకల ద్వారా వారి తరలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఒమన్ తీర ప్రాంతానికి సమీపంలో ఓ చమురు ట్యాంకర్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ నావికుడు నిశాంత్ ఉర్తనాథన్ అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఘటనపైనా రాయబార కార్యాలయం స్పందించింది.
నిశాంత్ కుటుంబసభ్యులు, ఆ నౌక సిబ్బంది సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఆయన భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా నౌక నుంచి దించి స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నది. ఇటీవల ఒమన్ తీరం సమీపంలో భారతీయులు ఉన్న నౌకలపై వరుసగా దాడులు జరిగాయి. వారం వ్యవధిలో మూడు నౌకలను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. భారత్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ చర్యలను ఆపేయాలంటూ అమెరికాపై నిరసన వ్యక్తం చేసింది.