నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: క్రికెట్..క్రికెట్ ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. కోట్లాది మంది మది దోచిన క్రీడగా వెలుగొందుతున్న భారత క్రికెట్ ఈ ఏడాది ఒకింత ఒడిదుడుకుల పయనంగా సాగింది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ గెలిచి కొత్త చరిత్రకు నాంది పలికిన టీమ్ఇండియాకు ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షగానే మారింది. సుదీర్ఘ ఫార్మాట్లో నిలకడైన విజయాలతో ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ చాంపియన్షిప్లో ఫైనల్ చేరిన కోహ్లీసేన..న్యూజిలాండ్ చేతిలో ఓటమితో రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ వెంటనే ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఆధిక్యంలో ఉండగా కరోనా కలకలంతో ఆఖరి మ్యాచ్ రద్దు కావడంతో సిరీస్ గెలుపును ఆస్వాదించలేకపోయింది. పొట్టి ఫార్మాట్లో ఎలాగైనా ప్రపంచకప్ కొట్టాలన్న కసితో బరిలోకి దిగిన కోహ్లీసేన..గ్రూపు దశలోనే వెనుదిరగడం సగటు అభిమానిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. టీ20 కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు, చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవీ విరమణ, ఆ తర్వాత కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ నేతృత్వంలో కివీస్పై టీ20 సిరీస్ క్లీన్స్వీప్, వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ను అనూహ్యంగా తొలగించడం, రోహిత్కు టెస్టు వైస్ కెప్టెన్సీ. ఆ తర్వాత బోర్డు వైఖరిని మీడియా ఎదుట చీల్చిచెండాడిన కోహ్లీ…బీసీసీఐ పెద్దలతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించిన తీరు ఈ ఏడాది చోటు చేసుకున్న పరిణామాలపై ప్రత్యేక కథనం.
ఆసీస్ గడ్డపై కొత్త చరిత్ర
ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర లిఖించింది. కొరకరాని కొయ్యగా మారిన కంగారూలపై టెస్టు సిరీస్ గెలిచి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. నాలుగు టెస్టుల సిరీస్ను 2-1తో సొంతం చేసుకుని ఔరా అనిపించింది. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే కుప్పకూలి టెస్టుల్లో కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా పేలవ ప్రదర్శన మూటగట్టుకుంది. హాజిల్వుడ్(5/8), కమిన్స్(4/21) ధాటికి భారత బ్యాటింగ్ సైకిల్ స్టాండ్ను తలపించింది. ఒక్కరంటే ఒక్కరు కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయారంటే మన బ్యాటింగ్ ఎంత ఆధ్వానంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అడిలైడ్ టెస్టు తర్వాత పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి రాగా.. మిగిలిన మూడు టెస్టులకు రహానే సారథిగా వ్యవహరించాడు. ఓవైపు కోహ్లీతో పాటు రోహిత్శర్మ లేకపోవడం బౌలర్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడినా..భారత్ పుంజుకున్న తీరు అద్భుతమని చెప్పాలి.
కోహ్లీ లేని లోటు ఏ మాత్రం కనిపించకుండా రహానే జట్టును నడిపించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మెల్బోర్న్ టెస్టులో విజయకేతనం ఎగురవేసిన టీమ్ఇండియా వెనుదిరిగి చూసుకోలేదు. మూడో(సిడ్నీ) టెస్టు డ్రాగా ముగిసినా..ఆఖరిదైన నాలుగో టెస్టు (గబ్బా)లో భారత్ విశ్వరూపం ప్రదర్శించింది. గాయాలతో సీనియర్ బౌలర్లు దూరమైనా..చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో యువ బౌలర్లు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించి తన తండ్రి కలను సాకారం చేయడంలో సఫలమయ్యాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్..మూడు దశాబ్దాలుగా ఆస్ట్రేలియాకు పెట్టని కోటగా ఉన్న..గబ్బాపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి ఖాతాలో వేసుకుంది. భారత చిరస్మరణీయ విజయానికి కోట్లాది మంది అభిమానులు ఫిదా అయిన తీరు అద్భుతం.
డబ్ల్యూటీసీ వైఫల్యం
సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఫైనల్స్కు చేరిన భారత్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. న్యూజిలాండ్తో జరిగిన తుదిపోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలై తొలిసారి టైటిల్ దక్కించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. వర్షం అంతరాయం మధ్య ఆరు రోజుల పాటు జరిగిన ఫైనల్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు పరిమితం కాగా, కివీస్ 249 పరుగులు చేసింది. రహానే(49) టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే కివీస్ బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో రెండో ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 170 పరుగులకే పరిమితమైంది. 139 పరుగుల లక్ష్యఛేదనలో రెండు వికెట్లు కోల్పోయిన కివీస్ అద్భుత విజయంతో టైటిల్ ఒడిసిపట్టుకుంది. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఎక్స్ట్రా పేసర్ను తీసుకోవాల్సిన చోట ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం మన గెలుపు అవకాశాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా మంచి ఫామ్మీదున్న హైదరాబాదీ స్పీడ్స్టర్ మహమ్మద్ సిరాజ్ను పక్కకు పెట్టి సీనియర్ ఇషాంత్శర్మను తీసుకోవడం ఏ మాత్రం కలిసిరాలేదు.
ఇంగ్లండ్తో ఢీ అంటే ఢీ
ఇంగ్లండ్ గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ ఒడిసిపట్టుకోవాలన్న కసితో బరిలోకి దిగిన కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా అన్నంత పని చేసింది. నాటింగ్హామ్లో తొలి టెస్టును డ్రా చేసుకున్న భారత్..క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో విజయదుందుభి మోగించింది. అయితే అదే జోరును కొనసాగించలేకపోయిన టీమ్ఇండియా..మూడో టెస్టును ఇంగ్లండ్కు సమర్పించుకుంది. దెబ్బతిన్న బెబ్బులిలా పుంజుకున్న కోహ్లీసేన..నాలుగో టెస్టులో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించింది. సిరీస్ ఇక తమదే అనుకుంటున్న తరుణంలో కరోనా వైరస్ కలకలంతో ఐదో టెస్టు వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.
కెప్టెన్సీ మార్పు: భారత కెప్టెన్ల మార్పు బీసీసీఐలో పెద్ద అలజడి రేపింది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ వద్దన్న తప్పుకున్నాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మీడియాతో పేర్కొనడం వివాదానికి కారణమైంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్టు జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు అనూహ్య నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని ఉన్నఫళంగా తప్పిస్తూ రోహిత్శర్మకు బాధ్యతలు అప్పగించడం, టెస్టులకు హిట్మ్యాన్ను వైస్కెప్టెన్గా నియమించడంతో అగ్గి రాజుకుంది. దీనిపై సఫారీ పర్యటనకు బయల్దేరే ముందు కోహ్లీ తనదైన రీతిలో బోర్డు వ్యవహారశైలిని ఎండగట్టాడు. బీసీసీఐ బాస్ గంగూలీ మాటకు పూర్తి వ్యతిరేకంగా సెలెక్షన్ కమిటీ సమావేశానికి సరిగ్గా గంటన్నర ముందు కెప్టెన్సీ నుంచి తప్పించారని విరాట్ బాంబు పేల్చాడు. వన్డే కెప్టెన్గా తాను కొనసాగాలనుకున్నా..