ముంబై, ఏప్రిల్ 8: అంతర్జాతీయ పరిస్థితులు భారత్ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పారేఖ్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియాకు గ్లోబల్ షాక్స్ నుంచి రక్షణ ఏదీ ఉండదని, అయితే ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలకంటే మెరుగ్గా తట్టుకోగలుగుతుందన్నారు. వ్యాక్సిన్ భద్రత, ఆహార భద్రత, డిజిటలైజేషన్ విస్తరణ, పటిష్ఠ దేశీ వినియోగం తదితర అంశాలు భారత్ ఆర్థిక రంగాన్ని పరిరక్షిస్తాయని వివరించారు.
ఇటీవలకాలంలో భౌగోళిక ఆర్థిక అంశాల్ని మించి భౌగోళిక రాజకీయాలు వ్యాపారం, సర్వీసులు, టెక్నాలజీ, మూలధన పెట్టుబడుల్ని ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. సరఫరా అడ్డంకులు, సైబర్ దాడులు, మనీలాండరింగ్, కృత్రిమ మేధ వినియోగం తదితర అంశాల్లో అంతర్జాతీయ పరస్పర సహకారం పెంపొందాల్సిన తరుణంలో దేశాల మధ్య అవిశ్వాసం పెరుగుతున్నదని పారేఖ్ ఆందోళన వ్యక్తం చేశారు.
మనం అదృష్టవంతులం..
ఏండ్ల తరబడి సరళ ద్రవ్య విధానాన్ని అవలంభించిన పశ్చిమ దేశాలు హఠాత్తుగా వడ్డీ రేట్లను పెంచుతూ పోతున్నాయని, దాంతో పలు దేశాల్లో జీవన వ్యయం పెరిగి, సంక్షోభం తలెత్తుతున్నదని హెచ్డీఎఫ్సీ చైర్మన్ చెప్పారు. ‘మనం మాత్రం లక్కీ. ఆర్బీఐ ఎట్టకేలకు రేట్ల పెంపు ప్రక్రియకు తాజాగా బ్రేక్ వేసింది’ అని పారేఖ్ వ్యాఖ్యానించారు.