కొమ్ములు తిరిగిన కెప్టెన్ అందుబాటులో లేకున్నా! మిడిలార్డర్లో నమ్మదగ్గ ఆటగాళ్లు ఏమాత్రం ప్రభావం చూపకపోయినా..! వాండరర్స్ పిచ్పై ప్రత్యర్థి పేసర్లు నిప్పులు చెరుగుతున్నా..!!
అదరక బెదరక ఎదురు నిలిచిన తాత్కాలిక సారథి కేఎల్ రాహుల్.. రెండో టెస్టులో టీమ్ఇండియాకు చుక్కానిలా మారి దారి చూపాడు. బౌన్స్కు సహకరిస్తున్న వికెట్పై సంయమనంతో ముందుకు సాగి ఆ మాత్రం స్కోరు అందించాడు. సారథి పోరాటానికి అశ్విన్ అండగా నిలువగా.. వరుణుడి ముప్పు పొంచి ఉన్న మ్యాచ్లో మన పేసర్లు ఎలా విజృంభిస్తారో చూడాలి!
జొహన్నెస్బర్గ్: మిడిలార్డర్ మరోసారి చేతులెత్తేయడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. వెన్ను నొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్కు దూరం కాగా.. అతడి స్థానంలో లోకేశ్ రాహుల్ జట్టును నడిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రవిచంద్రన్ అశ్విన్ (50 బంతుల్లో 46; 6 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
చతేశ్వర్ పుజారా (3), అజింక్యా రహానే (0) పూర్తిగా విఫలం కాగా.. కోహ్లీ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు హనుమ విహారి (20) ప్రభావం చూపలేకపోయాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా.. కగిసో రబడ, ఒలీవర్ చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా సోమవారం ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. మార్క్మ్ (7)ను షమీ పెవిలియన్ పంపగా.. ఎల్గర్ (11), పీటర్సన్ (14) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు.. భారత స్కోరుకు ఇంకా 167 పరుగులు వెనుకబడి ఉంది. న్యూజిలాండ్తో కాన్పూర్ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీతో కదం తొక్కిన మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కడుపునొప్పితో బాధపడుతుండటంతో.. విహారికి తుది జట్టులో చోటు దక్కగా.. ఈ మ్యాచ్కు ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
ఆ ఇద్దరే..
మ్యాచ్ ప్రారంభానికి ముందే విరాట్ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో.. వైస్ కెప్టెన్ రాహుల్ ఈ మ్యాచ్లో సారథ్య బాధ్యతలు భుజానెత్తుకున్నాడు. బౌన్స్కు సహకరిస్తున్న పిచ్పై నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కష్టం కావడంతో.. టాస్ గెలిచిన రాహుల్ తొలుత బ్యాటింగ్కు మొగ్గుచూపాడు. భారత ఇన్నింగ్స్ తొలి గంట చూసిన వారికి ఈ నిర్ణయం సరైందే అనిపించినా.. మంచి టచ్లో కనిపించిన మయాంక్ అగర్వాల్ (26; 5 ఫోర్లు)ను జాన్సెన్ ఔట్ చేయగా.. కాసేపటికి ఒలీవర్ వరుస బంతుల్లో పుజారా, రహానేను పెవిలియన్ బాట పట్టించాడు. షార్ట్ పిచ్ బంతిని తప్పుగా అంచనా వేసిన పుజారా.. బవుమాకు క్యాచ్ ఇవ్వగా.. ఎదుర్కొన్న తొలి బంతిని ఎలా ఆడాలా అనే సందిగ్ధంలోనే రహానే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.
ఒక ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నా.. కెప్టెన్గా ప్రమోషన్ అందుకున్న రాహుల్ ఎలాంటి తొందరపాటుకు పోకుండా నింపాదిగా ఇన్నింగ్స్ను ముందుకు నడిపాడు. అతడికి విహారి నుంచి కాస్త సహకారం లభించింది. వీరిద్దరు ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం తగ్గినా.. ఒక దశలో భారత్ 91/3తో కాస్త కొలుకున్నట్లు కనిపించింది. దాదాపు గంట పాటు క్రీజులో గడిపిన విహారిని రబడ బుట్టలో వేసుకోగా.. హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాక రాహుల్ షార్ట్ పిచ్ బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. ఆఖర్లో అశ్విన్ వేగంగా ఆడగా.. పంత్ (17), షమీ (9) అతడికి అండగా నిలిచారు. చివర్లో బుమ్రా (14 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడి జట్టు స్కోరును రెండొందల మార్క్ దాటించాడు. ఇన్నింగ్స్ మొత్తంలో నమోదైన ఏకైక సిక్సర్ బుమ్రా బ్యాట్ నుంచి రావడం కొసమెరుపు.
విరాట్కు వెన్నునొప్పి..
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి ముందే నొప్పి ఎక్కువవడంతో వైద్య సిబ్బంది సూచనతో విరాట్ తప్పుకున్నాడు. టాస్ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘విరాట్ మూడో టెస్టు వరకు అందుబాటులో ఉంటాడు’అని అన్నాడు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు చాన్స్ దక్కుతుందని భావించినా.. అతడు కడుపు నొప్పితో బాధపడుతుంటంతో తెలుగు ఆటగాడు హనుమ విహారి తుది జట్టులోకి వచ్చాడు. అంతా సజావుగా సాగితే కేప్టౌన్లో జరుగనున్న మూడో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ వంద మ్యాచ్లు పూర్తిచేసుకుంటాడనుకుంటే.. అది కాస్త వాయిదా పడ్డైట్లెంది. ఇక వచ్చే నెలలో బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగనున్న మ్యాచ్లో విరాట్ వంద మార్క్ చేరనున్నాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) రబడ (బి) జాన్సెన్ 50, మయాంక్ (సి) వెరినె (బి) జాన్సెన్ 26, పుజారా (సి) బవుమా (బి) ఒలీవర్ 3, రహానే (సి) పీటర్సన్ (బి) ఒలీవర్ 0, విహారి (సి) డసెన్ (బి) రబడ 20, పంత్ (సి) వెరినె (బి) జాన్సెన్ 17, అశ్విన్ (సి) పీటర్సన్ (బి) జాన్సెన్ 46, శార్దూల్ (సి) పీటర్సన్ (బి) ఒలీవర్ 0, షమీ (సి అండ్ బి) రబడ 9, బుమ్రా (నాటౌట్) 14, సిరాజ్ (సి) వెరినె (బి) రబడ 1, ఎక్స్ట్రాలు: 16, మొత్తం: 63.1 ఓవర్లలో 202. వికెట్ల పతనం: 1-36, 2-49, 3-49, 4-91, 5-116, 6-156, 7-157, -185, 9-187, 10-202, బౌలింగ్: రబడ 17.1-2-64-3, ఒలీవర్ 17-1-64-3, ఎంగ్డీ 11-4-26-0, జాన్సెన్ 17-5-31-4, కేశవ్ 1-0-6-0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (నాటౌట్) 11, మార్క్మ్ (ఎల్బీ) షమీ 7, పీటర్సన్ (నాటౌట్) 14, ఎక్సట్రాలు: 3, మొత్తం: 18 ఓవర్లలో 35/1. వికెట్ల పతనం: 1-14, బౌలింగ్: బుమ్రా 8-3-14-0, షమీ 6-2-15-1, సిరాజ్ 3.5-2-4-0, శార్దూల్ 0.1-0-0-0.