ప్రపంచకప్లాంటి టోర్నీలో పాకిస్థాన్తో తలపడేటప్పుడు ఒత్తిడి ఉండటం సహజమే. అయితే.. మైదానంలో అడుగుపెట్టాక దీన్ని మరో మ్యాచ్లానే చూస్తాం తప్ప అనవసర విషయాలను పట్టించుకోం. అన్ని మ్యాచ్ల్లాగే దీని కోసం సిద్ధమయ్యాం. గ్రౌండ్లో మా ప్రణాళికలను కచ్చితంగా అమలు చేసి విజయం సాధించాలనుకుంటున్నాం.
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ సమరానికి సమయం ఆసన్నమైంది! రోమాలు నిక్కబొడుచుకునే ఉత్కంఠ క్షణాలకు.. నరాలు తెగే ఉద్వేగభరిత సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి మహా సంగ్రామానికి దుబాయ్ వేదిక కానుంది! ఐసీసీ టోర్నీల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమ్ఇండియా.. ఆ ముద్ర చెరిపేసుకొని నయా చరిత్ర లిఖించాలని పాకిస్థాన్ ‘బిగ్ ఫైట్’కు సిద్ధమయ్యాయి. టీ20 ప్రపంచకప్నకు అసలు సిసలు వన్నెతెచ్చే హైవోల్టేజ్ మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను ఆరోసారి అడుగుకు తొక్కాలని కోహ్లీసేన కంకణం కట్టుకుంటే.. ఈసారైనా భారత్పై పైచేయి సాధించాలని పాక్ తహతహలాడుతున్నది!
దుబాయ్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది! విశ్వవేదికపై దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమ్ఇండియా.. సేమ్ సీన్ రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నది. టీ20 ప్రపంచకప్ సూపర్-12 తొలి మ్యాచ్లో కోహ్లీ సేన.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్తో ద్వైపాక్షిక సిరీస్లకు దూరంగా ఉంటున్న టీమ్ఇండియా.. గత కొన్నేండ్లుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రమే దాయాదితో తలపడుతున్నది. టీ20 వరల్డ్కప్లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్లు జరుగగా.. ఐదింట నెగ్గిన భారత్ ఫుల్ జోష్తో బరిలోకి దిగనుంది. వన్డే ప్రపంచకప్లో భారత్, పాక్ మధ్య ఏడు మ్యాచ్లు జరుగగా.. అందులోనూ టీమ్ఇండియా సం పూర్ణ ఆధిపత్యం కనబర్చిన నేపథ్యంలో పాకిస్థాన్ అండర్డాగ్గా మైదానంలో అడుగుపెట్టనుంది. పొట్టి ప్రపంచకప్లో పాక్పై ఐదుసార్లు గెలిచిన భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుత జట్టుకు మెంటార్గా వ్యవహరిస్తుండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం కాగా.. కీలక పోరుకు ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. మరి సంప్రదాయం కొనసాగుతుందా.. లేక సంచలనం నమోదవుతుందా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది!
ఇటీవల దుబాయ్లో జరిగిన మ్యాచ్ల్లో బ్యాటింగ్ మెరుపుల కన్నా.. బౌలింగ్ ప్రదర్శనలే ఎక్కువ నమోదవుతున్నాయి. ఇంగ్లండ్, వెస్టిండీస్ పోరులోనూ ఇదే రుజువైంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. స్లో పిచ్పై స్పిన్నర్లు కీలకం కానున్నారు. టీమ్ఇండియా ముగ్గురు స్పిన్నర్లను బరిలో దించిన ఆశ్చర్యపోనక్కర్లేదు!
భారత్ (అంచనా): కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, సూర్యకుమార్, పంత్, పాండ్యా, జడేజా, వరుణ్/శార్దూల్, అశ్విన్/భువనేశ్వర్, బుమ్రా, షమీ.
పాకిస్థాన్ (12): బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్, హఫీజ్, మాలిక్, ఆసిఫ్, ఇమాద్, షాదాబ్, రౌఫ్, హసన్ అలీ, షాహీన్ షా, హైదర్.