నాటింగ్హమ్: టీ20 వరల్డ్కప్ నెగ్గిన తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ చెత్తాటతో నిరాశపరుస్తోంది. ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ అయిన తర్వాత ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన అయ్యర్సేన వరుసగా రెండో ఓటమి ఖాతాలో వేసుకుంది. గత పోరులో బౌలింగ్లో ఫెయిలైన భారత్ ఈసారి పేలవ బ్యాటింగ్తో అతి పెద్ద పరాజయంతో తలదించుకుంది. మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో 125రన్స్ తేడాతో ఓడింది. షార్ట్ ఫార్మాట్లో పరుగుల పరంగా భారత్కు ఇదే అతి పెద్ద ఓటమి. 2019లో వెల్లింగ్టన్లో న్యూజిలాండ్ చేతిలో 80 రన్స్ తేడాతో ఓడిన మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు మరింత చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లండ్ ఇచ్చిన 202 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 11.4 ఓవర్లలో 76 రన్స్కే కుప్పకూలింది. జోష్ టంగ్ (4/28), జోఫ్రా ఆర్చర్ (3/29) పేస్ ధాటికి టాప్, మిడిలార్డర్ కుదేలైంది. ఓపెనర్లు అభిషేక్ (10), సూర్యవంశీ (13)తో పాటు ఇషాన్ (13), కెప్టెన్ అయ్యర్ (5), అక్షర్ (10), తిలక్ (3), శివం దూబే (2) పెవిలియన్కు క్యూకట్టడంతో జట్టుకు ఘోర పరాభవంతప్పలేదు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లిష్ టీమ్ 20 ఓవర్లకు 201/7 స్కోరు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 70), ఆల్రౌండర్ సామ్ కరన్ (41 నాటౌట్), జోస్ బట్లర్ (36) మెరుపులు మెరిపించారు. భారత బౌలర్లలో ప్రిన్స్, హర్షిత్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 గురువారం జరుగుతుంది.