విరాట్ సెంచరీ నిరీక్షణకు తెరపడేనా!
నేటి నుంచి భారత్, శ్రీలంక రెండో టెస్టు
వద్దు వద్దంటూనే గులాబీ టెస్టులకు ఓకే చెప్పిన టీమ్ఇండియా.. నాలుగో డే అండ్ నైట్ టెస్టుకు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య చిన్నస్వామి వేదికగా నేటి నుంచి రెండో
టెస్టు ప్రారంభం కానుండగా.. ఫలితంపై ఎవరికీ సందేహాలు లేకపోయినా.. విరాట్ కోహ్లీ 71వ అంతర్జాతీయ శతకం కోసమే ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. పుట్టి
పెరిగింది ఢిల్లీలోనే అయినా.. కెరీర్ ప్రారంభం నుంచి ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న విరాట్కు చిన్నస్వామి మైదానమైనా కలిసొస్తుందా చూడాలి!
బెంగళూరు: రెండేండ్ల క్రితం బంగ్లాదేశ్తో డే అండ్ నైట్ టెస్టులో చివరి సారిగా శతక్కొట్టిన విరాట్ కోహ్లీ.. మళ్లీ గులాబీ బంతితో మ్యాచ్లో మూడంకెల స్కోరు
సాధించాలని అభిమానులంతా ఆశిస్తున్న వేళ.. భారత్, శ్రీలంక రెండో టెస్టుకు రెడీ అయ్యాయి. చిన్నస్వామి స్టేడియంలో శనివారం నుంచి ఇరు జట్ల మధ్య గులాబీ టెస్టు
షురూ కానుంది. డే అండ్ నైట్ టెస్టులను ఆరంభంలో వ్యతిరేకిస్తూ వచ్చిన టీమ్ఇండియా.. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక తొలిసారి పింక్ బాల్తో మ్యాచ్
ఆడింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్తో ఫ్లడ్లైట్ల వెలుతురులో టెస్టులాడిన భారత్.. ఇప్పుడు నాలుగో మ్యాచ్కు సమాయత్తమవుతున్నది. గత మ్యాచ్లో రవీంద్ర
జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టడంతో ఘనవిజయం సాధించిన రోహిత్ సేన.. ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ క్లీన్స్వీప్ చేయాలని భావిస్తున్నది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్కు ముందు భారత ఆటగాళ్లంతా కలిసి ఆడనున్న చివరి మ్యాచ్ ఇదే కాగా.. మూడో స్పిన్నర్గా జయంత్ యాదవ్
స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. మూడో స్థానంలో
హనుమ విహారి.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు రానున్నారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్
పటేల్తో భారత బ్యాటింగ్ లైనప్ శత్రు దుర్భేద్యంగా కనిపిస్తున్నది. బౌలింగ్లో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ పేస్ భారాన్ని మోయనుండగా.. అశ్విన్, జడ్డూ,
అక్షర్ తిప్పేసేందుకు రెడీగా ఉన్నారు. పిచ్పై పచ్చిక కనిపిస్తుండటంతో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్కు తుది జట్టులో చోటిచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.
మరోవైపు తొలి టెస్టులో కనీస పోటీనివ్వలేకపోయిన లంక ఈ మ్యాచ్లోనైనా పోరాడాలని చూస్తున్నది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), మయాంక్, విహారి, కోహ్లీ, శ్రేయస్, పంత్, జడేజా, అశ్విన్, అక్షర్, బుమ్రా, షమీ.
శ్రీలంక: కరుణరత్నె (కెప్టెన్), తిరుమనె, మెండిస్, మాథ్యూస్, ధనంజయ, అసలంక, డిక్వెల్లా, చమిక, లక్మల్, ఎంబుల్దెనియా, ప్రవీణ్.