వన్డే కెప్టెన్సీ మార్పు.. టెస్టు సారథ్యానికి విరాట్ కోహ్లీ వీడ్కోలు.. భారీ అంచనాల మధ్య సుదీర్ఘ ఫార్మాట్లో సఫారీల చేతిలో ఓటమి.. ఇలా గత కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో టీమ్ఇండియాకు మరో షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా గడ్డపై గత పర్యటనలో వన్డే సిరీస్ నెగ్గిన భారత జట్టు.. ఈ సారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది. బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై క్రీజులో నిలదొక్కుకునేందుకు తడబడ్డ టీమ్ఇండియా బ్యాటర్స్.. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంటే.. వరుసగా రెండో మ్యాచ్లోనూ గెలుపొందిన ఆతిథ్య దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది!
పార్ల్: బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై మనవాళ్లు మరోసారి తడబడటంతో.. వన్డే సిరీస్లోనూ టీమ్ఇండియాకు నిరాశ తప్పలేదు. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయి డీలాపడ్డ భారత్.. వన్డే సిరీస్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. చిన్న బౌండ్రీల మైదానంలో ప్రత్యర్థి ముందు మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించడంలో విఫలమైన రాహుల్ సేన సిరీస్ కోల్పోయింది. వరుసగా రెండు వన్డేల్లోనూ నెగ్గిన ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (55), రిషబ్ పంత్ (71 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), అర్ధశతకాలతో రాణించగా.. శార్దూల్ ఠాకూర్ (40 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన పరుగులు సాధించాడు. తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) డకౌట్ కాగా.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (11), వెంకటేశ్ అయ్యర్ (22) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సఫారీ బౌలర్లలో షంసీ రెండు, మార్క్మ్,్ర కేశవ్, ఫెలుక్వాయో, సిసండా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఓపెనర్లు జానెమన్ మలన్ (91; 8 ఫోర్లు, ఒక సిక్సర్), క్వింటన్ డికాక్ (78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. కెప్టెన్ టెంబా బవుమా (35), మార్క్మ్ (37 నాటౌట్), డసెన్ (37 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, చాహల్, శార్దూల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. డికాక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. పార్ట్ టైమ్ స్పిన్నర్ మార్క్మ్త్రో కలుపుకొని షంసీ, కేశవ్ మహారాజ్ సగానికి ఎక్కువ ఓవర్లు వేసి టీమ్ఇండియాను కట్టడి చేసిన చోట.. భారత స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 287/6 (పంత్ 85, రాహుల్ 55; షంసీ 2/57).
దక్షిణాఫ్రికా: 48.1 ఓవర్లలో 288/3 (మలన్ 91, డికాక్ 78; బుమ్రా 1/37).