ఢిల్లీ,జూలై :టోల్ ప్లాజాలో వాహనాల రద్దీని తగ్గించడానికి రోడ్డు రవాణా శాఖ ఫాస్ట్ట్యాగ్ అమలు చేసిన విషయం తెలిసిందే. హైవేలపై టోల్ టాక్స్ చెల్లింపును భారత ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. ఆ తరువాత అన్ని కార్లపై ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. అయితే ఇప్పుడు ఢిల్లీ లో వాహనాలను పార్కింగ్ చేయాలంటే ఫాస్ట్ ట్యాగ్ ను అమలుచేస్తున్నారు. దేశంలోని మొట్టమొదటి ఫాస్ట్ట్యాగ్,యుపిఐ ఆధారిత నగదు రహిత పార్కింగ్ సౌకర్యాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్లో ప్రారంభించారు. అందుకోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ పార్కింగ్ సదుపాయంలో 55 ఫోర్ వీలర్లు, 174 ద్విచక్ర వాహనాలను పార్క్ చేసే వీలున్నది. ఈ పార్కింగ్ సౌకర్యం కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్ గేట్ నెం-6 వద్ద అందుబాటులో ఉంది. ఫోర్ వీలర్స్ తోపాటు టూవీలర్స్ పార్కింగ్ ఛార్జీలు చెల్లించడానికి ఫాస్ట్ ట్యాగ్ లేదా యుపిఐ యాప్ ద్వారా పార్కింగ్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.