IND vs WI 1st Test : గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురవారం ప్రారంభమైన టీమిండియా-వెస్టిండీస్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఇవాళ్టి ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించి మ్యాచ్పై పటిష్టమైన పట్టు సాధించింది. భారత పేసర్ల దాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే ఆలౌట్ కాగా.. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆటముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులతో ఉంది.
ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత పేస్ ద్వయం మహమ్మద్ సిరాజ్ (4/40), జస్ప్రీత్ బుమ్రా (3/42) నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. వారి ధాటికి క్రీజులో నిలదొక్కుకోవడానికి ఏ ఒక్క బ్యాటర్ కూడా ఎక్కువసేపు ప్రయత్నించలేదు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీయడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విండీస్ జట్టులో జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధిక స్కోరు.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36) మంచి ఆరంభం ఇవ్వగా సాయి సుదర్శన్ (7) విఫలమయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. రాహుల్ ఓపికగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ 53, గిల్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇండియా ఇంకా 41 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉండటంతో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయి.