న్యూఢిల్లీ, మే 13: భారత్ వాణిజ్యలోటు భారీగా పెరిగిపోయింది. ముగిసిన ఏప్రిల్ నెలలో ఎగుమతులు జోరు చూపించినప్పటికీ, దిగుమతులు సైతం అదేస్థాయిలో అధికంకావడంతో వాణిజ్యలోటు 20.11 బిలియన్ డాలర్లకు చేరింది. నిరుడు ఇదే నెలలో ఈ లోటు15.29 బిలియన్ డాలర్లుంది.
పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రసాయినాలు తదితర రంగాల తోడ్పాటుతో ఏప్రిల్ నెలలో ఎగుమతులు 30.7 శాతం వృద్ధిచెంది 40.19 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు శుక్రవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. ఇదే నెలలో దిగుమతులు సైతం 30.97 శాతం వృద్ధితో రూ. 60.3 బిలియన్ డాలర్లకు చేరాయి. ముగిసిన నెలలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పెద్ద ఎత్తున 113 శాతం పెరిగాయి. ఇవి 7.73 బిలియన్ డాలర్లకు చేరాయి. 9.2 బిలియన్ డాలర్ల విలువైన ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. సర్వీసుల ఎగుమతుల విలువ 53 శాతం పెరిగి 27.60 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే దిగుమతైన సర్వీసుల విలువ 62 శాతం వృద్ధితో 15.57 బిలియన్ డాలర్లకు చేరాయన్నది.
పెట్రోలియం, క్రూడ్ దిగుమతులు భారీగా 87.54 శాతం పెరిగి 20.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 4.93 బిలియన్ డాలర్ల విలువైన బొగ్గు, కోక్ దిగుమతులు జరిగాయి. బంగారం దిగుమతులు మాత్రం 72 శాతం క్షీణించి 1.72 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. గత ఏడాది ఏప్రిల్లో 6.23 బిలియన్ డాలర్ల విలువైన పుత్తడి దేశంలోకి దిగుమతయ్యింది.