హైదరాబాద్, నవంబర్ 25: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీకి.. హైదరాబాదీ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మాలో వాటా 5 శాతాన్ని మించింది. ఈ నెల 24న బహిరంగ మార్కెట్లో 79వేల అరబిందో ఫార్మా షేర్లను ఎల్ఐసీ కొన్నట్లు కంపెనీ గురువారం స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఈ కొనుగోలుకు ముందు ఎల్ఐసీ వద్ద 2,92,76,635 అరబిందో ఫార్మా షేర్లు ఉన్నాయి. కంపెనీ ఈక్విటీలో ఇవి 4.99 శాతానికి సమానం. తాజా కొనుగోలుతో షేర్ల సంఖ్య 2,93,55,635కు చేరింది. దీంతో ఎల్ఐసీ వాటా 5.01 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో గురువారం అరబిందో ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 1.53 శాతం లాభంతో రూ. 669 వద్ద ముగిసింది.