హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని, ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ విధానానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. దీంతో రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు క్రమంగా జోరందుకొంటున్నాయని, వివిధ ఆటోమొబైల్ సంస్థలు కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే ప్రక్రియలో ఉన్నాయన్నారు.
ప్యాసింజర్ వాహన శ్రేణి ఆటోమొబైల్ సంస్థ మ్యారీస్ గ్యారేజెస్ (ఎంజీ) రూపొందించిన 7 సీటర్, 5 సీటర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలను ఈ మేరకు గురువారం మినిస్టర్ క్వార్టర్స్లోని తన నివాసంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆవిషరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును, రోడ్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేశామన్నారు. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహన కొనుగోళ్లపై మక్కువ చూపుతున్నారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,568 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని, వీటిలో 3,572 ద్విచక్రవాహనాలు ఉన్నాయని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో అడుగుపెట్టిన ఎంజీ సంస్థ ప్రతినిధులకు, సిబ్బందికి మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలిపారు.