న్యూఢిల్లీ, నవంబర్ 13: ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాన్ని ఎమర్జెన్సీ పరిస్థితిగా పేర్కొంటూ గాలి నాణ్యతను పెంపొందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేంద్రం, ఢిల్లీ సర్కారును ఆదేశించింది. రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడమే కాలుష్యానికి కారణమని, వారిపైకి నెపం నెట్టివేయడంపై మండిపడింది. రైతులను నిందించడం ఫ్యాషనైపోయిందని చీవాట్లు పెట్టింది. కాలుష్యానికి పటాకులు, వాహనాలు, పరిశ్రమలు కారణం కాదా? అని నిలదీసింది. ఢిల్లీలో వాహనాలు తిరుగకుండా నిలిపివేయడం, లాక్డౌన్ విధించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రజలు ఇండ్లలో ఉన్నప్పుడు కూడా మాస్క్లు ధరిస్తున్నారని, కాలుష్యం అంత తీవ్రంగా ఉందని పేర్కొంది. ఢిల్లీలో కాలుష్యం అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ శనివారం విచారణ జరిపింది.
ఢిల్లీ ప్రజల్ని నియంత్రించండి
‘ఢిల్లీ సరిహద్దు రాష్ర్టాలైన పంజాబ్, హరియాణా, యూపీల్లో రైతులు ఏటా పంట చేతికొచ్చిన తర్వాత మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. దాంతో ఢిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నద’ని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యానికి రైతులే కారణమన్నట్టు మాట్లాడుతున్నారని, ఇతర కారణాల వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ‘ముందు ఢిల్లీ ప్రజలను నియంత్రణలో పెట్టాలి. పటాకులు కాల్చకుండా, వాహనాల కాలుష్యాన్ని అదుపు చేయడానికి కట్టుదిట్టమైన చర్యలేవీ? పంట వ్యర్థాలను తగులబెట్టడం కూడా కాలుష్యానికి కొంతవరకు కారణమవుతున్నదని తెలుసు. మిగతాదంతా పటాకులు, వాహనాలు, పరిశ్రమలు, దుమ్ము తదితరాల వల్లే. ఢిల్లీలో ఏక్యూఐ స్థాయిలను 500 నుంచి 200కు ఎలా తీసుకువస్తారో చెప్పండి. రెండు రోజుల లాక్డౌన్ వంటి తక్షణ చర్యలను చేపట్టండ’ని సూచించింది. సోమవారం బదులివ్వాలని ఆదేశించింది.
పటాకుల కాలుష్యం చూశారా?
ఢిల్లీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా కూడా రైతులు పంట వ్యర్థాలను తగులబెడుతున్న అంశాన్ని ప్రస్తావించారు. దాంతో ‘రైతులను నిందించడం ఫ్యాషన్ అయిపోయింది. ఢిల్లీలో గత ఏడు రోజులుగా పటాకులను ఎలా కాలుస్తున్నారో చూశారా? ఢిల్లీ పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
స్మాగ్ టవర్లు పనిచేస్తున్నాయా?
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మాగ్ టవర్లు పనిచేస్తున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవి పనిచేస్తున్నాయని ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ రాహుల్ మెహ్రా తెలిపారు. దేశంలోనే ఫస్ట్ స్మాగ్ టవర్ను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో సీఎం కేజ్రీవాల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
వారం పాటు స్కూళ్లు బంద్
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారడంతో వారం రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఆదివారం నుంచి బుధవారం నిర్మాణ కార్యకాలపాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ అవకాశం కల్పించింది. ప్రైవేటు ఉద్యోగుల విషయంలో ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది.
నాకు మంచి ఇంగ్లిషు పరిజ్ఞానం లేదు: సీజేఐ
‘నేను గొప్ప వక్తని కాను. ఇది నా లోపమనుకుంటా. నేను 8వ తరగతిలో ఇంగ్లిష్ నేర్చుకున్నా. పదాలను ప్రయోగించడానికి నాకు మంచి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేద’ని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. లా మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదివానని తెలిపారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పద ప్రయోగంలో తన పొరపాటును గ్రహించి సారీ చెప్పినప్పుడు సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. తానూ 8వ క్లాస్లోనే ఇంగ్లిషు నేర్చుకున్నానని, డిగ్రీ వరకు గుజరాతీ మీడియమేనని మెహతా తెలిపారు. ఇద్దరం ఒకే బోటులో ప్రయాణిస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ కాలుష్యానికి కారణాలేంటి?
న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రతి ఏటా చలికాలం ప్రారంభం అయ్యే సమయానికి ఢిల్లీ, జాతీయ రాజధాని పరిధి(ఎన్సీఆర్)లోని నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ నగరాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. ఉత్తర భారతదేశంలోని మిగతా నగరాలతో పోల్చితే ఇక్కడ గాలి కాలుష్యం ఎక్కువగా ఉండటానికి కారణం నోయిడా, ఘజియాబాద్లో పరిశ్రమలే. మిగతా నగరాలతో పోల్చితే ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండటమే కాక.. ఇవి ఇంకా సంప్రదాయ ఇంధనంతోనే నడుస్తున్నాయి. కేవలం ఢిల్లీలోని పరిశ్రమలే డీజిల్, పెట్రోల్ లాంటి సంప్రదాయ ఇంధనాల నుంచి సీఎన్జీకి మారాయి. నోయిడా,ఘజియాబాద్, ఫరీదాబాద్లలో పరిశ్రమలు ఇంకా చమురుతోనే నడుస్తున్నాయి. దీంతో కాలుష్యం ఎక్కువగా ఉంటున్నది. నోయిడాలో 6,200 పరిశ్రమలు ఉన్నాయి. ఘజియాబాద్లో 27వేల పరిశ్రమలు ఉన్నాయి. ఫరీదాబాద్లో 5వేల పరిశ్రమలు ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం ఇవన్నీ డీజిల్ను వాడుతున్నాయి. దీంతో పాటు వాహనాల నుంచి వచ్చే పొగ, ఎన్సీఆర్ చుట్టుపక్కల పొలాల్లో కోతల అనంతరం గడ్డిని కాల్చేయడం వల్ల జరుగుతున్న కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.