బాసర/తొగుట, ఏప్రిల్ 16 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చక్క అరవింద్ (16) బాసరలో పీయూసీ సెకండియర్ చదువుతున్నాడు. మంగళవారం ఉద యం హాస్టల్ గదిలో ఉన్న తోటి విద్యార్థులు తరగతి గదులకు వెళ్లగా అరవింద్ మాత్రం గదిలోనే ఉండిపోయాడు. ఎవ రూ లేని సమయం చూసి హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడు. అనంతరం గదిలోకి వచ్చిన తోటి విద్యార్థులు గమనించి సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అరవింద్ను ట్రిపుల్ ఐటీలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని నిర్మల్ ఏరియా దవాఖానకు తరలించా రు.
తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హాజరు శాతం తక్కువగా ఉండటంతో ఈనెల 18 నుంచి మే 2 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థి అరవింద్ను బాసర ట్రిఫుల్ ఐటీ అధికారులు అనుమతించ లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరవింద్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తున్నది. అయితే విద్యార్థి వ్యక్తిగత కారణాలతో మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. సీఐ మల్లేశ్, ఎస్సై గణేశ్ ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ జానకీ షర్మిల సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటీని పరిశీలించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.