జనగామ : మహిళలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్వయం శక్తితో ముందుకు రావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పాలకుర్తి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు, పలువురు మహిళలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారితో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. సీఎం కెసీఆర్ దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక మహిళా అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
వాటి ద్వారా ఒనగూరుతున్న లాభాలను చెప్పారు. మన రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు. ఆయా పథకాలు ఉపయోగించుకొని రాష్ట్ర మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు.