తిరుమల : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ (Vice President Dhanakhad) తిరుమల వేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి దంపతులకు టీటీడీ(TTD) ఈవో ఏవి.ధర్మారెడ్డి , అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేశారు. ఈవో శ్రీవారి శేష వస్త్రాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఉప రాష్ట్రపతి మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల క్షేత్రం ప్రాచీన భారతీయ సంస్కృతి, నాగరికతలో మహోన్నతమైనదని చెప్పారు. టీటీడీ పరిపాలన, భక్తులకు అందిస్తున్న సేవలు అన్ని మతాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ భూమ్మీద నివసించే మానవాళిలో 1/6 వంతు భారతీయులని, పురాతన నాగరికతకు భారత భూమి జన్మస్థానమని వివరించారు.