లఖింపూర్ ఖీరీ (యూపీ), ఫిబ్రవరి 15: బీజేపీకి తిరిగి అధికారాన్ని కట్టబెడితే దేశం మరో ఉత్తర కొరియాగా మారుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేశ్ టికాయిత్ హెచ్చరించారు. ప్రధానిగా మోదీ, యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ మళ్లీ గద్దెనెక్కితే దేశం నియంతపాలనలోకి వెళ్తుందన్నారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘పేద ప్రజల అవసరాలను తీరుస్తూ వారికి ప్రతినిధులుగా ఉండే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావాలా? లేదా ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలన కావాలా? ప్రజలే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. రాష్ర్టాల్లో, కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో నియంత పాలన కొనసాగుతుందని, రెండో కిమ్ జోంగ్ ఉన్ (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) మళ్లీ పాలన పగ్గాలు చేపడితే దేశం మరో ఉత్తర కొరియాగా మారుతుందని హెచ్చరించారు. లఖింపూర్ హింసాత్మక ఘటనలకు సూత్రధారి, నలుగురు అన్నదాతల మరణానికి కారణమైన ఆశిష్ మిశ్రాకు బెయిల్ రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
భౌతిక విచారణకు సుప్రీంకు..
రైతులను వాహనాలతో తొక్కించి చంపి.. జైలు నుంచి దర్జాగా బయటకు వచ్చిన ఆశిష్మిశ్రాకు వత్తాసు పలుకుతున్న ఇలాంటి నియంత ప్రభుత్వం అవసరమా? అని టికాయిత్ ప్రశ్నించారు. ఆశిష్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేస్తుందన్నారు. లఖింపూర్ కేసులో ఆశిష్ బెయిల్ విచారణ ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు కరెంట్ పోయిందని, అందుకే ప్రాసిక్యూషన్ తన కీలక పాయింట్లను కోర్టు ముందు ఉంచలేకపోయిందన్నారు. అందుకే భౌతిక విచారణ కోసం సుప్రీంను ఆశ్రయిస్తామని తెలిపారు. ‘రైతులను వాహనాలతో తొక్కించిన ఆశిష్మిశ్రా నేడు జైలు నుంచి బయటకు రావడం యావత్తు దేశం చూస్తున్నది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా మతాన్నే ఎజెండాగా మార్చుకొని బీజేపీ ఎన్నికల్లో ఓట్ల కోసం పాకులాడుతున్నదని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో బీజేపీకి శిక్ష వేయండి
సాగుచట్టాలను వెనక్కి తీసుకొంటున్నట్టు గత నవంబర్లో ప్రధాని మోదీ ప్రకటించిన సమయంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఎస్కేఎం నాయకుడు శివకుమార్ శర్మ గుర్తుచేశారు. ప్రధాని మోదీ హామీనిచ్చినప్పటికీ, కేంద్రప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవడం, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తామన్న హామీలపై అధికార బీజేపీ వెనుకడుగు వేస్తున్నదన్నారు. ఎమ్మెస్పీపై కమిటీ ఏర్పాటుపై ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతిని కోరుతామని గత పార్లమెంటు సమావేశాల్లో వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారని, కమిటీ ఏర్పాటుకు ఈసీ అనుమతితో సంబంధం లేదన్నారు. ప్రధాని ప్రకటించినా కమిటీ ఏర్పాటు చేయకపోవడమేంటని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేసినా తాము ప్రశ్నించబోమని, అయితే బీజేపీని మాత్రం తప్పకుండా శిక్షించాలని ప్రజలను కోరారు.