కరీంనగర్ రూరల్, మార్చి 20: దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన బృహత్తర దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. ఆదివారం కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో దళిత బందు లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరై మాట్లాడారు. దేశాన్ని 70ఏండ్లపాటు ఎంతమంది పాలించినా వెనుకబడిన కులాలు, జాతులు ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో వారందరి జీవితాల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ ఇలాంటి గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా.. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రాష్ట్ర సర్కారు రూ.10లక్షలు బ్యాంక్ ఖాతాలో జమచేస్తుందని, నచ్చిన యూనిట్ను ఎంపిక చేసుకొని ఆర్థిక స్థిరత్వం సాధించాలని సూచించారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని హుజూరాబాద్లో చేపట్టగా దిగ్విజయంగా అమలవుతున్నదని, కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని సంతోషం వెలిబుచ్చారు. పథకం కింద అందరూ ఒకే రకమైన యూనిట్ను పెట్టుకుంటే లక్ష్యం నెరవేరదని, గ్రామాల వారీగా వారి అవసరాల మేరకు యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం జరుగుతుందని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలో తొలుత 100 మందికి ఇస్తున్నారని, ఇందులో కరీంనగర్ మండలం నల్లగుంటపల్లికి 37, తాహెర్కొండాపూర్లో 29, కరీంనగర్ అర్బన్లో 25, కొత్తపల్లి మండలంలో 4 యూనిట్లు మంజూరు చేశారని వివరించారు. వచ్చే ఏప్రిల్ నాటికి నియోజకవర్గానికి 1500 నుంచి 2 వేల కుటుంబాలకు యూనిట్లు వస్తాయని తెలిపారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ దళిత బంధు చాలా గొప్ప పథకమని, యూనిట్లు సద్వినియోగం చేసుకొని దినదినాభివృద్ధి చెందాలని సూచించారు. భారీ పెట్టుబడి యూనిట్లను సైతం లబ్ధిదారులు బృందాలు ఏర్పడి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని, ఆ దిశగా ఆలోచించుకోవాలని సూచించారు. రేపటి నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు. ఎలాంటి సందేహాలు, అనుమానాలు ఉన్నా కలెక్టర్, లేదా నోడల్ అధికారి ఆర్డీవో ఆనంద్కుమార్కు సంప్రదిచవచ్చని తెలిపారు. ఇక్కడ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, నగర మేయర్ వై సునీల్రావు, జడ్పీటీసీ పురుమల్ల లలిత, ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ వెంకట్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, బల్మూరి ఆనందరావు, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, ఆర్ష మల్లేశం, సరళి ప్రసాద్, మెండి చంద్రశేఖర్,కృష్ణ. సర్పంచ్లు ఉన్నారు.