ముంబై, ఏప్రిల్ 28: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్…చిన్న, మధ్యతరహ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే రెండేండ్లకాలంలో ఈ రంగానికి అత్యధికంగా రూ.40 వేల కోట్ల వరకు రుణాలను మంజూరు చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ రంగానికి రూ.20 వేల కోట్ల స్థాయిలో రుణాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎస్ఎంఈ సంస్థలు భారీగా వృద్ధి చెందుతున్నాయని, దీంతో ఈ రంగంలో ఉన్న సంస్థలకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు బ్యాంక్ ఈడీ అనుపూర్ బాగ్చి తెలిపారు. బ్యాంక్ మొత్తం రుణాల్లో ఎస్ఎంఈ వాటా 10 శాతంగా ఉన్నదని, వచ్చే రెండేండ్లలో ఈ పరిధి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు..జీడీపీలోనూ మూడోవంతు వీటి ద్వారానే సమకూరుతున్నది.