న్యూఢిల్లీ, జనవరి 26: ఆర్థిక మాంద్యం భయాల నడుమ బహుళజాతి కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటాలు ఇప్పటికే చాలా మందిని తొలగించగా…. ఈ వరుసలో ఇప్పుడు టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం కూడా చేరిపోయింది. తాజాగా 3,900 మంది సిబ్బందిని తొలగించినట్లు ఐబీఎం ప్రకటించింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవల సంస్థ కైంద్రియల్ బిజినెస్ సేవలను మూసివేయడంతో వీరిని తొలగించాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ ఉద్యోగుల తొలగింపుతో జనవరి-మార్చి మధ్యకాలంలో సంస్థకు 300 మిలియన్ డాలర్ల ఖర్చు మిగలనున్నదని ఐబీఎం చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జేమ్స్ కవనాగ్ తెలిపారు. గడిచిన కొన్నేండ్లుగా తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో తమ వ్యాపారంలో ఖర్చులను తగ్గించుకోగలిగామని, ఇదే తీరు భవిష్యత్తులోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన ఎర్నింగ్ కాల్లో ఆయన చెప్పారు. డిసెంబర్31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ 16.7 బిలియన్ డాలర్ల ఆదాయంపై 3.6 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని గడించింది.
ఎస్ఏపీలో 3 వేల మందిపై వేటు!
జర్మనీకి చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం ఎస్ఏపీ కూడా ఉద్యోగుల తొలగింపు జాబితాలోకి చేరబోతున్నది. ఈ ఏడాది 3 వేల మంది ఉద్యోగులను వదలించుకోవడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు చుట్టుముట్టడంతో వరుసగా టెక్నాలజీ దిగ్గజాలు ఒక్కోక్కటి ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఐబీఎం కూడా మొత్తం ఉద్యోగుల్తో 2.5 శాతం మందిని ఇంటికి పంపేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం సంస్థలో 1.20 లక్షల మంది ఉండగా..వీరిలో 3 వేల మందిని తొలగించబోతున్నది. మరోవైపు డౌ కూడా ప్రపంచవ్యాప్తంగా 2 వేల మంది సిబ్బందిని వదలించుకోనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏడాదికి బిలియన్ డాలర్ల ఆదాయం ఖర్చు తగ్గనున్నట్లు పేర్కొంది.