న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపులేని రాజకీయా పార్టీలపై ఇవాళ ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల పేరుతో విరాళాలు వసూల్ చేస్తున్న కేసులో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నది. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్(ఆర్యూపీపీ)కు చెందిన అక్రమ ఫండింగ్ అంశంలో ఐటీశాఖ సోదాలు చేస్తోంది. గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు, వాటి ఆపరేటర్లు, ఇతరులపై ఏకకాలంలో ఐటీశాఖ తనిఖీలు చేస్తోంది. ఎన్నికల కమిషన్ చేసిన సిఫారసు ప్రకారమే ఐటీశాఖ అకస్మిక దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు 87 పార్టీలు ప్రస్తుతం అందుబాటులో లేవని ఎన్నికల సంఘం గుర్తించింది. రూల్స్ను అతిక్రమించిన దాదాపు 2100 మంది రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.