హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 : అది హైదరాబాద్లోని రసూల్పురా. ఈ పేరు వినగానే చాలా మందికి అదొక మురికివాడగానే గుర్తొస్తుంది. కానీ అది గతం. ఇప్పుడు ఆ కాలనీకి చెందిన ఎర్రా దుర్గాప్రసాద్ (20), గౌతమ్ కంకట్ల (21) అనే ఇద్దరు నిరుపేద యువకులు భారత నౌకాదళంలో చేరి సత్తా చాటారు. ఓ ప్రైవేట్ స్కూల్లో చదివిన వీరిద్దరికి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) అండగా నిలిచింది. శిక్షణ ఇవ్వడంతోపాటు వారి చదువు, న్యూట్రిషన్ ఖర్చులన్నీ భరించింది. ఈ క్రమంలో గౌతమ్ 2016లో నేషనల్ బ్రౌన్స్ మెడల్, 2018లో నేషనల్ ఛాంపియన్ (సెయిలింగ్)సాధించగా.. దుర్గాప్రసాద్ 2017లో నేషనల్ చాంపియన్ (సెయిలింగ్) సాధించి ఔరా అనిపించాడు. ఇంటర్ పూర్తవగానే వారిద్దరు నౌకాదళ ఉద్యోగానికి దరఖాస్తు చేసి కొలువు సాధించారు. ఒడిశాలో 3 నెలలు కఠోర శిక్షణ అనంతరం ముంబైలో పోస్టింగ్ పొందడంతో గౌతమ్, దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.