ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో ఖాతా తెరిచేందుకు తహతహలాడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ శనివారం తొలిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన సన్రైజర్స్ కూర్పు సరిచేసుకోవాలని చూస్తుంటే.. కొత్త సారథి రవీంద్ర జడేజా గెలుపు బోణీ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. మెగా వేలంలో తమ నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన సన్రైజర్స్ ఫ్రాంచైజీ.. తుది జట్టు కూర్పులోనూ వింత ప్రయోగాలు చేస్తున్నది. ఐపీఎల్లో విజయవంతమైన ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని మూడో స్థానంలో ఆడిస్తున్న యాజమాన్యం.. నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉన్న విలియమ్సన్తో ఓపెనింగ్ చేయిస్తున్నది. వన్డౌన్లో మంచి ఇన్నింగ్స్లు ఆడే సత్తా ఉన్న మార్క్మ్న్రు లోయర్ ఆర్డర్లో బరిలోకి దింపడం కూడా రైజర్స్ వైఫల్యాలకు ఓ కారణంగా కనిపిస్తున్నది. భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్, సుందర్, షెఫర్డ్తో కూడిన బౌలింగ్ దళం ఫర్వాలేదనిపిస్తున్నా.. బ్యాటింగ్ యూనిట్ సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. సారథి విలియమ్సన్ ఓ స్ఫూర్తివంతమైన ఇన్నింగ్స్తో జట్టులో జవసత్వాలు నింపుతాడా చూడాలి!
డిఫెండింగ్ చాంపియన్గా లీగ్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. గత మూడు మ్యాచ్ల్లోనూ ఆకట్టుకోలేకపోయింది. మిస్టర్కూల్ మహేందర్సింగ్ ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టును గెలుపు బాట పట్టించలేకపోతున్నాడు. దీపక్ చాహర్ వంటి ఏస్ పేసర్ అందుబాటులో లేకపోవడంతో పాటు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం చెన్నైని ఇబ్బంది పెడుతున్నది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన తర్వాత ‘హ్యాట్రిక్’పరాజయాలు ఎదురవడంతో జడేజా ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. గత మూడు మ్యాచ్ల్లో 0,1,1తో తీవ్రంగా నిరాశ పరిచిన గైక్వాడ్.. ఇప్పటికైనా బ్యాట్కు పనిచెప్పకపోతే అతడిపై వేటు పడే అవకాశాలున్నాయి. గత సీజన్లో పరుగుల వరద పారించిన ఈ మహారాష్ట్ర కుర్రాడు తిరిగి గాడిన పడాలని మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. ‘గైక్వాడ్ నైపుణ్యం ఉన్న ఆటగాడు. అతడిపై నమ్మకముంచాలి. తదుపరి మ్యాచ్లో అతడు సత్తాచాటుతాడు’అని గత మ్యాచ్ అనంతరం జడేజా పేర్కొన్నాడు. ఊతప్ప ఆర్ధశతకంతో ఆకట్టుకోగా.. మోయిన్ అలీ, అంబటి రాయుడు తమకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లు మలచలేకపోతున్నారు. ధోనీ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేస్తుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం కాగా.. బౌలింగ్లో బ్రేవో, ప్రిటోరియస్, జడేజా కీలకం కానున్నారు.
హైదరాబాద్: విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మార్క్మ్,్ర పూరన్, సుందర్, సమద్, షెఫర్డ్, భువనేశ్వర్, గోపాల్, నటరాజన్.
చెన్నై: జడేజా (కెప్టెన్), గైక్వాడ్, ఊతప్ప, మోయిన్ అలీ, రాయుడు, దూబే, ధోనీ, బ్రేవో, ప్రిటోరియస్, జోర్డాన్, తుషార్.