హైదరాబాద్, జనవరి 20: దేశీయ రియల్ ఎస్టేట్లో సంస్థాగత పెట్టుబడులను అత్యధికంగా హైదరాబాదే ఆకట్టుకున్నదని గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సేవల దిగ్గజం జేఎల్ఎల్ తెలిపింది. గతేడాది భారతీయ సంస్థాగత రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అంతకుముందుతో పోల్చితే 14 శాతం క్షీణించినా.. హైదరాబాద్ మాత్రం వృద్ధిరేటును కనబర్చినట్టు తమ తాజా నివేదికలో స్పష్టం చేసింది. నిరుడు దేశంలోకి సుమారు రూ.32,000 కోట్ల (4.3 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు వస్తే.. ఇందులో దాదాపు రూ.5,120 కోట్ల (687 మిలియన్ డాలర్లు) పెట్టుబడులను హైదరాబాద్ రియల్టీలోకే సంస్థాగత మదుపరులు తెచ్చారని వెల్లడించింది. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది 16 శాతానికి సమానమని పేర్కొన్నది. కాగా, రూ.5,080 కోట్లతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ తర్వాతి స్థానంలో ఉన్నది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా ఉన్నదని ఈ సందర్భంగా జేఎల్ఎల్ ప్రధాన ఆర్థికవేత్త శమంతక్ దాస్ అన్నారు.