సిటీ బ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు సవరణ జాబితా ప్రక్రియలో ఎన్యూమరేషన్ గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో హైదరాబాద్ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ శతశాతం పూర్తి చేసిన డిజిటైజేషన్ మాత్రం 60 శాతానికి కూడా చేరుకోలేకపోయింది. సోమవారం గడువు ముగిసేసరికి డిజిటైజేషన్ కేవలం 58.9 శాతం మాత్రమే పూర్తయింది.
గ్రామీణ జిల్లాలో డిజిటలీకరణ 80 శాతం నుంచి 90 శాతానికి పైగా పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలో ఓటర్లు ఓటు నమోదు చేసుకోవడంలోనూ వెనుకంజలోనే ఉన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు గడువును రెండు సార్లు పొడిగించినా ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. దీన్ని బట్టి 40 శాతం ఓటర్లు తమ ఓటును సొంతూళ్లలోనే నమోదు చేసుకున్నట్లు తేటతెల్లమవుతున్నది. బీఎల్వోలు మొదటి నుంచి ఓటర్లు ఇండ్లకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు. పోలింగ్ కేంద్రాలకే ఓటర్లను పిలిపించుకుని పంపి ణీ చేశారు. సమాచారం లేనివాళ్లు ఫారాలే తీసుకోలేదు.
నగర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డవాళ్లు దాదాపుగా తమ సొంతూళ్లలోనే ఓటు నమోదు చేసుకునేందుకు మొగ్గుచూపారు. నగరంలోని 41 శాతానికి పైగా ఓటర్లు తమ స్వగ్రామాల్లోనే ఓటు నమోదు చేసుకున్నట్లు స్పష్టమవుతున్నది. ఊళ్లో ఓటు హక్కు ఉంటేనే గౌరవ మర్యాదలు ఉంటాయని భావించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో సగం కంటే ఎక్కువ డిజిటైజేషన్ జరగలేదు.
సిటీలో నియోజకవర్గాల వారి డిజిటైజేషన్ 65 శాతానికి దాటలేదు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60 శాతానికి పైగా డిజిటలీకరణ పూర్తయింది. అత్యధికంగా బహదూర్పురలో 65 శాతం డిజిటలీకరణ పూర్తయింది. అత్యల్పంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో 54 శాతానికి పరిమితమైంది.