హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ హబ్గా మారుతున్నది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు భాగ్యనగరమే అడ్డాగా నిలుస్తున్నది. తమ కార్యకలాపాలను విస్తరించేందుకు, ప్రపంచ స్థాయిలో కొత్తగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్నే ఎంపిక చేసుకుంటున్నాయి. ఇందుకోసం పెద్దమొత్తంలో ఆఫీసు స్పేస్ను లీజుకు తీసుకుంటున్నాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన మెట్రో నగరాల్లో కొత్త జీసీసీలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో సింహభాగం హైదరాబాద్లోనే ఉన్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా ఈ నెల మొదటి వారంలో వెల్లడించిన నివేదిక ప్రకారం దేశంలోనే హైదరాబాద్లో జీసీసీల కోసం ఎక్కువ ఆఫీసు స్పేస్ను ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు లీజుకు తీసుకున్నాయని పేర్కొన్నది.
2024 జనవరి-మార్చి త్రైమాసికంలో 2 మిలియన్లు (సుమారు 20 లక్షల చదరపు అడుగులు) హైదరాబాద్లో కంపెనీలు లీజుకు తీసుకున్నాయని, ఇతర నగరాలతో పోల్చితే 39 శాతం అధికమని నివేదికలో వెల్లడించింది. 2023 మొదటి త్రైమాసికం (క్యూ1-2023)లో 0.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకోగా, తాజాగా 2024 క్యూ1లో అది 3.0 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఐటీ కంపెనీలు లీజుకు తీసుకున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదికలో వెల్లడించింది. జీసీసీలకు హబ్గా మారేందుకు దేశంలోనే హైదరాబాద్కు మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఇతర దేశాలు, నగరాలతో పోల్చితే హైదరాబాద్ కేంద్రంగా జీసీసీలను ఏర్పాటు చేస్తే ఖర్చు తగ్గడంతోపాటు నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.