సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకమండలి సర్వసభ్య సమావేశం ఈనెల 18న ప్రత్యక్షంగా నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో తొలి సమావేశం ఈ ఏడాది జూన్ 29న వర్చువల్ పద్ధతిన జరిగింది. వివిధ పార్టీల సభ్యులు అడిగిన 14 ప్రశ్నలపై విస్తృతంగా చర్చించి వాటి పరిష్కారంతోపాటు 2021-22 వార్షిక బడ్జెట్ను ఆమోదించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ ముగియడంతో ఈనెల 18న పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో ఈనెల 8న స్థాయీ సంఘం సమావేశం నిర్వహించాలని మేయర్ విజయలక్ష్మీ ఆదేశించారు. ఇక మీదట రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర విలువైన పనుల అనుమతి కోసం స్టాండింగ్ కమిటీ వారానికోసారి సమావేశమవుతుంది.