సికింద్రాబాద్, మార్చి 4: తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కార్ఖాన పోలీసులు అరెస్టు చేశారు. నార్త్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. జీడిమెట్ల సుభాష్నగర్ కాలనీకి చెందిన మహ్మద్ అహ్మద్ పాష ( 26 ) గతంలో బోయిన్పల్లి, తిరుమలగిరి, మేడ్చల్, జవహర్ నగర్, జీడిమెట్ల, కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేశాడు. రెండు సార్లు జైలుకు కూడా వెళ్లివచ్చాడు.
అయినా అతడిలో మార్పు రాలేదు. తాజాగా కార్ఖానా పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1.2 కిలోల గంజాయి, హశీశ్ ఆయిల్ ప్యాకెట్, 12 గ్రాముల బంగారు ఆభరణాలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.