సిటీబ్యూరో, నవంబరు 17(నమస్తే తెలంగాణ) : సైబరాబాద్, రాచకొండ, రైల్వే పోలీసులు గంజాయి, డ్రగ్స్ సరఫరాపై డేగ కన్ను పెట్టారు. ముంబై నుంచి హైదరాబాద్కు డ్రగ్స్, విశాఖ, ఒడిశా రాష్ర్టాల నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్న నిందితులను బుధవారం అరెస్టు చేశారు. 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, 176 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 మందిని అరెస్టు చేయగా, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రైల్వే డీఎస్పీ శ్రీనివాస్రావు, మేడిపల్లి పోలీసులు వివరాలను వెల్లడించారు.
సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు మాదాపూర్, బాచుపల్లి, రాజేంద్రనగర్ పరిధిలో డ్రగ్స్, గంజాయిని తరలిస్తున్న వారిని పట్టుకున్నారు.వీరి వద్ద నుంచి 50 గ్రాముల ఎండీఏంఏ డ్రగ్స్..45 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్టు చేశారు. సైబరాబాద్ పరిధిలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో మొత్తం 132 ఎఫ్ఐఆర్లను నమోదు చేసి 257 మందిని అరెస్టు చేసి, 263 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిపై పీడీ యాక్ట్ను విధించారు.
అలాగే కోణార్క్ ఎక్స్ప్రెస్లో 120 కేజీల గంజాయిని ముంబైకి తరలిస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళలు అంబిక, మాలతీలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 11 మంది నిందితులను అరెస్టు చేసి.. 296 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే చెంగిచర్ల ప్రాంతంలో గంజాయిని అమ్ముతున్న కృష్ణను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు.