కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 2 : కూకట్పల్లిలో దేవీ శరన్నవరాత్రోత్సవ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని పోచమ్మతల్లి దేవాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా చల్లగా ఉండాలని.. సుఖసంతోషాలతో అభివృద్ధిని సాధించాలని ప్రజలు చేసినట్లు తెలిపారు. మాజీ కార్పొరేటర్ బాబురావు, ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ రాజు, బుట్టో రాంబాబు, నూతి రాంబాబు నాయుడు, వాసు నాయుడు, తదితరులున్నారు.\
శ్రీవాసవీ దేవాలయంలో..
కేపీహెచ్బీ కాలనీలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవిగా అలంకరించి పూజలు చేశారు. పామూహిక కుంకుమార్చన, హోమ పూజలు చేశారు.
శ్రీకనకదుర్గా దేవాలయంలో..
కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని శ్రీకనకదుర్గా దేవాలయంలో అమ్మవారు సరస్వతీ దేవిగా ప్రజలకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు అన్నసమారాధన చేశారు. నేడు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి పూజలు చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ప్రగతినగర్లో..
ప్రగతినగర్ కమ్యూనిటీహాల్లో దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసాయి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అక్షరాభ్యాసం పూజలు చేసి పుస్తకాలు, పెన్నులను అమ్మవారి ప్రసాదంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గార్లపాటి సత్యనారాయణ, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ డివిజన్లో..
బాలానగర్, అక్టోబర్ 2 : బాలానగర్ పారిశ్రామిక వాడలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం బాలానగర్ డివిజన్ పరిధి ఫిరోజ్గూడ, వినాయకనగర్లలో ఏర్పాటు చేసిన దేవి మండపాలను బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శిచుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాలానగర్ కనకదుర్గ ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఫతేనగర్ డివిజన్ పరిధి జవహార్నగర్కాలనీలోని కనకదుర్గాదేవి, శీతాలాదేవి, కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఆదివారం ఏడోరోజు అమ్మవారు సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి రోజు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, కుంకుమార్చన, పసుపుబొట్టు, లలిత సహస్రనామపారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.