బేగంపేట్ అక్టోబర్ 1: ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 23.7 కిలోల భారీ కణితిని సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు తొలగించారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో సర్జికల్ ఆంకాలజీ విభాగం అధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర పర్వతనేని వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన 42 ఏండ్ల మహిళ పొత్తి కడుపులో నొప్పితో స్థానికంగా ఉండే ఓ వైద్యుడిని సంప్రదించగా కడుపులో కణితి ఉందని శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. రెండేండ్ల నుంచి ఆమె శస్త్ర చికిత్సను వాయిదా వేయడంతో కణితి పరిమాణం పెరిగి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, డాక్టర్ నాగేంద్ర పర్వతనేని పరిశీలించి భారీ కణితిని తొలగించడం సవాలుతో కూడుకున్నదని గుర్తించారు. 3 గంటల పాటు ఆమెకు శస్త్ర చికిత్స చేసి అండాశయంలో ఉన్న 23.7 కిలోలు, 25 సెంటిమీటర్ల వ్యాసంలో ఉన్న భారీ కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి సాధారణంగా ఉందని, కోలుకుంటుందని డాక్టర్ పర్వతనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దీప్తి, వంశీ తదితరులు పాల్గొన్నారు.