దుండిగల్, సెప్టెంబర్ 26: లోన్యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… విజయవాడకు చెందిన రాజేశ్ (35) ఐదేండ్ల కిందట నగరానికి వచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి బాచుపల్లిలోని కేకేఎంఫేస్-1, 6వ ట్విన్ టవర్ జీ1 ఫ్లాట్లో ఉంటున్నాడు. అతడికి భార్య, మూడేండ్ల కూతురు ఉంది. రాజేశ్ బిగ్ బాస్కెట్లో పనిచేస్తుండగా.. అతడి భార్య గృహిణి. ఇటీవల రాజేశ్ ఆన్లైన్ లోన్ యాప్లో రూ.50 వేలు వరకు రుణం తీసుకున్నాడు. అప్పు చెల్లించాలని లోన్యాప్ నిర్వాహకులు వేధిస్తూ.. కుటుంబ సభ్యుల ఫొటోలను అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో రాజేశ్ మానసిక ఆందోళనకు గురయ్యాడు. దసరా పండుగ నేపథ్యంలో భార్య వారం రోజుల కిందట విజయవాడలోని తన పుట్టింటికి వెళ్లింది. రాజేశ్ సోమవారం మధ్యాహ్నం తన ఫ్లాట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదే సమయంలో మృతుడికి కొరియర్ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ విషయమై భార్య అతడికి ఫోన్ చేయగా ఎంతకీ స్పందించలేదు. దీంతో ఆమె ఇదే విషయమై వాచ్మన్కు ఫోన్చేసి చూసి చూడమని చెప్పింది. వాచ్మన్ వెళ్లి చూడగా.. రాజేశ్ సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా రాజేశ్ అప్పటికే మృతి చెందాడు.
సరిగ్గానే చెల్లిస్తున్నా..!
ఘటనా స్థలంలో పరిశీలించగా ‘ నేను లోన్యాప్లో డబ్బులు తీసుకున్నాను.. సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ నిర్వాహకులు తరచూ ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. వారి బాధ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. అని బోర్డుపై రాజేశ్ రాసినట్లు గుర్తించారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కలుగజేసుకుని ఆన్లైన్ లోన్యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పార్థివ శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.