సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: డెంగీ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ డెంగీ వ్యాధి నివారణ దినం సందర్భంగా మేయర్ క్యాంపు కార్యాలయంలో డెంగీ వ్యాధి నివారణకు జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యలపై ఎంటమాలజీ విభాగం ద్వారా అవగాహన కార్యక్రమాలను మేయర్ సందర్శించి పరిశీలించారు. దోమల వ్యాప్తిని అరికట్టడానికి క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, మొదలైన వాటిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి వాటిని నిర్మూలించాలని మేయర్ చెప్పారు. వర్షాకాలంలో డెంగీ ప్రభావం మొదటి నుంచి రుతు పవనాలు తగ్గే వరకు ఎకువగా ఉన్న నేపథ్యంలో నివారణ చర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. దోమల నియంత్రణలో నూతన సాంకేతిక పద్ధతిలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు దోమల నివారణకు చేపడుతున్న పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజీ రజనీ, ఏఈ రజనీ కాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డెంగీ రానీయకండి..
రానున్న వర్షాకాలంలో డెంగీ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అడిషనల్ కమిషనర్ బి.సంతోష్ ప్రజలను కోరారు. కుందన్ బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ దోమల ద్వారా డెంగీ సంక్రమించే అవకాశాలున్న నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దోమల ఉత్పత్తి నివారణకు జీహెచ్ఎంసీ ద్వారా అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టుతున్నట్లు తెలిపారు. మానవ వనరులతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాన్ని కూడా వినియోగించుకుంటూ డెంగీ ప్రబలకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు, అధికారులు సమన్వయంతోనే దోమల నివారణ సాధ్యమన్నారు. ఈ సమావేశంలో ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు, ఎంటమాలజీ అధికారులు సిబ్బంది, పాల్గొన్నారు.