తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 12: మహిళా విద్యను ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కళాశాలలు ప్రోత్సహించాలని హోం మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చారు. రెడ్హిల్స్లో గల ఫ్యాప్సీ ఆడిటోరియంలో శుక్రవారం మదీన మహిళా డిగ్రీ, పీజీ కళాశాల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న హోం మంత్రి మహమూద్ 2017 నుంచి 2021వ బ్యాచ్ విద్యార్థినిలకు పట్టాలను పంపిణీ చేసి వారిని ఉత్సాహపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.7,200 కోట్లు మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఫలితాలలో బాలికలు పోటీతత్వంతో చదివి వారి సత్తా చాటారని ఆయన గుర్తు చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ, జీవితంలో మహిళలు ఉన్నతంగా రాణించాలంటే విద్యతోనే సాధ్యమన్నారు.
మదీన విద్యా సంస్థలు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. సమాజం ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలంటే మహిళల ప్రాముఖ్యత ప్రధానమని అన్నారు. కళాశాల డైరెక్టర్ కేఎం మిన్హాజుద్దీన్, ప్రిన్సిపాల్ అఫ్రోజ్ అస్సియాలు తమ ప్రసంగంలో ముప్పయ్యేండ్లుగా కళాశాల చేస్తున్న కృషిని, సాధించిన విజయాలను తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు నౌషిన్ సుల్తానా, సీమాఖాన్ పాల్గొన్నారు.