KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానాన్ని జాతీయ వేదికపై చాటిచెప్పారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ స్పష్టం చేశారు. కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా, దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
“ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరుగెత్తినప్పుడు, భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందని రుజువైంది. ఈ రేసు దాదాపు రూ. 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించి, అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించింది” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఫార్ములా-ఈ ఈవెంట్ ఒక ఆరంభం మాత్రమేనని, తెలంగాణ స్థిరమైన, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక వృద్ధి లక్ష్యాన్ని కలిగి ఉందని, త్వరలోనే హైదరాబాద్ భారతదేశ మొబిలిటీ వ్యాలీ’గా ఆవిర్భవించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మోటార్స్పోర్ట్స్ అంటే కేవలం వేగం కాదు.. అది తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడం, హద్దులను ఛేదించడం, ఎంత దూరం వెళ్లగలమో తెలుసుకోవడం అని, జీవితంలో యువత కూడా రేసు కారు మాదిరి దూసుకుపోవాలని కేటీఆర్ అన్నారు. ఐటీ మంత్రిగా తన హయాంలో, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ-హబ్, భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రమైన టీ-వర్క్స్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఎలా నిర్మించిందో కేటీఆర్ వివరించారు. “ఒక ఆలోచన టీ-హబ్ నుంచి టీ-వర్క్స్కు వెళ్లడానికి ఒక టీ తాగేంత సమయం మాత్రమే పడుతుంది” అంటూ ఆలోచన అమలు వేగాన్ని చమత్కరించారు.